విధాత: రాష్ట్రంలో మే 6 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు అందించారు. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగుతున్నామని జేఏసీ స్పష్టం చేసింది.
మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలన మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సమ్మెకు పూర్తిగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని యూనియన్లతోపాటు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు కూడా కలిసిరావాలని కోరారు.
ఆర్టీసీలో ఖాళీల భర్తీ, పనిభారం తగ్గింపు, వేతనాల సవరణ, ఆలవెన్సుల పెంపు, ఆర్టీసీ విలీన ప్రక్రియపై అపాయింట్ మెంట్ డే ప్రకటన, మహాలక్ష్మీ పథకం బకాయిలు చెల్లింపు, కారుణ్యనియమకాలు వంటి సమస్యలపై ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగించనుంది.