Telangana Talli Flyover | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) రాష్ట్ర సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్( BRS Govt ) ప్రభుత్వ సంస్థలకు, పలు యూనివర్సిటీలకు, పలు ఫ్లై ఓవర్లు, చారిత్రక కట్టడాలకు పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కూడా అదే బాటలో నడిచింది. నడుస్తుంది కూడా. తాజాగా హైదరాబాద్ నగరం( Hyderabad City ) నడిబొడ్డున ఉన్న ఓ ఫ్లై ఓవర్ మార్పునకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న ఫ్లై ఓవర్.. అందరికీ తెలుగు తల్లి ఫ్లై ఓవర్( Telugu Talli Flyover )గా సుపరిచితం. ఇకనుంచి ఆ పేరు వినిపించదు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్కు తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్( Telangana Talli Flyover )గా నామకరణం చేయాలని జీహెచ్ఎంసీ( GHMC ) స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ ఫ్లై ఓవర్ తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్గా మారనుంది.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2.95 కోట్లతో అల్వాల్ సర్కిల్లోని చిన్నరాయుని చెరువు నుంచి దినకర్నగర్ వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆర్కేపురం బ్రిడ్జి వద్ద ఆర్వోబీ నిర్మాణానికి 52 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది. యాకుత్పుర ఎస్ఆర్టీ కాలనీలో రూ. 2.95 కోట్లతో లండన్ బ్రిడ్జి పునర్ నిర్మించనున్నారు. రూ. 4.85 కోట్లతో మల్లేపల్లి ఫుట్బాల్ గ్రౌండ్ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. రూ. 2.8 కోట్లతో మాదాపూర్లోని ఆదిత్యనగర్ శ్మశానవాటిక, రూ. 2.4 కోట్లతో కృష్ణా నగర్ శిల్పాహిల్స్ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రూ. 4.5 కోట్లతో అల్వాల్ సర్కిల్ 133వ వార్డులోని హైటెన్షన్ లైను కింద వీబీఆర్ గార్డెన్స్ నుంచి ఎస్ఎన్ రెడ్డి ఎన్క్లేవ్ వరకు సీసీ రోడ్డు, రూ. 3.95 కోట్లతో కాప్రా సర్కిల్ భవానీ నగర్ నుంచి కమలానగర్ నాలా వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు.