విధాత, హైదరాబాద్ : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సేవలు మరింత విస్తరిస్తామని, ఆంధ్రప్రదేశ్లో సైతం బసవతారకం ఆసుపత్రి ప్రారంభించనున్నామని, ఆసుపత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అందరికీ ఆదర్శమని, బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని కొరిన వెంటనే ఆయన అందుకు అంగీకరించారని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ సీఎం ఎన్.టి.రామారావు దూరదృష్టి కలిగిన వ్యక్తి అని… ఆయన మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని గుర్తు చేశారు. గతంలో బండలతో నిండిన ఈ స్థలంలో బసవతారక ఆసుపత్రి నిర్మించారని.. రోగులకు మంచి సేవలు అందుతున్నాయన్నారు. భారత ప్రధానిగా అటల్ బిహారి వాజ్పేయ్ రూ.6 కోట్లు మంజూరు చేసి ఈ ఆసుపత్రి బలోపేతానికి దోహద పడ్డారని నందమూరి బాలకృష్ణ వివరించారు. ఇంత గొప్ప ఆసుపత్రికి చైర్మన్గా పని చేయడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. నా సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసి కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.