Bulletproof Car : ఆంధ్రప్రదేశ్ టీడీపీ నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కు ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు (Bulletproof Car) ను కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పల్లా శ్రీనివాసరావు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. గుడివాడ అమర్నాథ్పై ఆయన విజయం సాధించారు. 2014-19 మధ్య కూడా పల్లా శ్రీనివాసరావు శాసనసభ్యునిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా అయిన రెండుసార్లు టీడీపీ అధికారంలో ఉన్నది.
పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం 1984 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్మిక నాయకుడిగా, టీడీపీ అనుబంధ విభాగం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (TNTUC) ఏర్పాటులో పల్లా తండ్రి కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసరావును, ఆయన కుటుంబాన్ని ఐదేళ్లపాటు తీవ్రంగా వేధించింది.