ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు వేస్తాం

రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ మైనింగ్‌ జరగడం లేదు హైకోర్ట్ ఆదేశాలతో ఒక లీజుదారుకు మాత్రమే లాటరైట్‌ మైనింగ్‌ కు ఈ ప్రభుత్వం అనుమతి మంజూరు ఈ లీజుదారు ఇప్పటి వరకు 5వేల టన్నుల లాటరైట్‌ మాత్రమే మైనింగ్ చేశారు 5 వేల టన్నుల అమ్మకంతో రూ.15వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? గత ప్రభుత్వం విశాఖజిల్లాలో లాటరైట్ మైనింగ్‌కి 6 లీజులు ఇచ్చింది అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయ్యన్నపాత్రుడు.. ఆయన అనుచరులు లాటరైట్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారు […]

ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు వేస్తాం

రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ మైనింగ్‌ జరగడం లేదు

  • హైకోర్ట్ ఆదేశాలతో ఒక లీజుదారుకు మాత్రమే లాటరైట్‌ మైనింగ్‌ కు ఈ ప్రభుత్వం అనుమతి మంజూరు
  • ఈ లీజుదారు ఇప్పటి వరకు 5వేల టన్నుల లాటరైట్‌ మాత్రమే మైనింగ్ చేశారు
  • 5 వేల టన్నుల అమ్మకంతో రూ.15వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం?
  • గత ప్రభుత్వం విశాఖజిల్లాలో లాటరైట్ మైనింగ్‌కి 6 లీజులు ఇచ్చింది
  • అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయ్యన్నపాత్రుడు..
  • ఆయన అనుచరులు లాటరైట్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారు
  • గనులశాఖ విచారణలో అవి నిర్థారణ అయ్యాయి
  • అక్రమ మైనింగ్‌పై భారీ జరిమానాలు కూడా విధించాము
  • వాస్తవాలను వక్రీకరించి ఒక మీడియా తప్పుడు కథనాలు ప్రచురించింది
  • ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే కథనాలపై పరువునష్టం కేసు
  • ఆధారాలు లేకుండా అసత్య కథనాలు రాయడం మీడియా సత్యనిష్టకు విరుద్దం
  • అటవీప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకే సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యం

గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనులశాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి

విధాత:విశాఖజిల్లాలో లాటరైట్ మైనింగ్‌లో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. విజయవాడలోని ఎపిఎండిసి కార్యాలయంలో భూగర్భ గనులశాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం జిల్లాలో లాటరైట్ మైనింగ్ కోసం ఆరు లీజులను మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హైకోర్ట్ ఆదేశాల మేరకు కేవలం ఒక మైనింగ్ లీజుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని తెలిపారు.

అది కూడా లీజు దారుడు న్యాయస్థానం ద్వారా ఉత్తర్వులు పొందడం వల్ల, సదరు లీజుకు అనుమతి మంజూరు చేశామని వివరించారు. ఈ లీజుదారు కూడా ఇప్పటి వరకు కేవలం 5 వేల టన్నుల లాటరైట్‌ మాత్రమే మైనింగ్ చేశారని అన్నారు. దీని ద్వారా 15వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఒక పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఖండించారు. మొత్తం మైనింగ్ విలువే అంత లేనప్పుడు, అన్ని వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అటవీ వనరులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు సీఎం శ్రీ వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతంను పరిరక్షించుకోవడానికి మైనింగ్ లీజుల విషయంలో కూడా ప్రభుత్వం పర్యావరణానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు వేస్తాం
రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదని, అయినా కూడా విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ జరుగుతోందని ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం రాసిందని శ్రీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అలాగే లాటరైట్ మైనింగ్‌లో 15వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని ఆ పత్రికలో వచ్చిన కథనం పూర్తి అవాస్తవమని అన్నారు. కేవలం ప్రభుత్వ ప్రతిష్టను,మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆత్మస్థైర్యంను దెబ్బతీసేందుకు ఇలా కుట్రపూరితంగా తప్పుడు కథనాలను ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కథనం రాసే సందర్భంలో కనీసం అధికారులను సంప్రదిస్తే వాస్తవాలను తెలియచేసే వారిమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపైనా, గనులశాఖపైనా బురదచల్లేందుకు ఇటువంటి కథనాలను ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై న్యాయస్థానంలో పరువునష్టం కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. మీడియా సత్యనిష్టకు ఇటువంటి కథనాల వల్ల విఘాతం ఏర్పడుతోందని, ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు.మీడియా వాస్తవాలను ప్రజలకు తెలియచేసేలా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ మైనింగ్‌కు అనుమతి లేదు
భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డిజిఎం) విజి వెంకటరెడ్డి
విశాఖజిల్లాలో ప్రభుత్వ అనుమతితో జరుగుతున్న లాటరైట్ మైనింగ్‌ను బాక్సైట్ మైనింగ్‌గా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి ఖండించారు. లాటరైట్, బాక్సైట్ ఖనిజాలు వేరువేరుగా ఉంటాయని,రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ ఖనిజాల మైనింగ్‌కు ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న ప్రదేశంలో లభించే ఖనిజం లాటరైట్ అని 2010లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో 1981-82లో జరిగిన పరిశోధనల్లో ఇక్కడ లభించే ఖనిజం లాటరైట్‌గా నిర్థారించారని తెలిపారు. కేవలం ఒక లీజు ద్వారా జరుగుతున్న లాటరైట్ మైనింగ్‌ లో ఇప్పటి వరకు 5వేల టన్నుల లాటరైట్‌ను వెలికితీశారని, టన్ను లాటరైట్ అల్యూమినియం తయారీ పరిశ్రమలకు అయితే రూ.200, ఇతర పరిశ్రమలు వినియోగించిన టన్నుకు కేవలం రూ.100 మాత్రమే వసూలు చేస్తారని తెలిపారు.

గత ప్రభుత్వంలో మంత్రి అయ్యన్న మైనింగ్ అక్రమాలు
గత ప్రభుత్వంలో లాటరైట్ మైనింగ్‌లో మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన అనుయాయులు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ అయిందని విజి వెంకటరెడ్డి తెలిపారు. సదరు అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మైన్స్‌ అధికారులు విచారణ జరిపారని, సదరు అక్రమ మైనింగ్‌లపై భారీ జరిమానాలు కూడా విధించడం జరిగిదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా మైనింగ్‌ లో ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని అన్నారు. ఆరోపణలు వచ్చిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం, వెంటనే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జగనన్న కాలనీలకు ఇసుక కొరత లేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు పక్కాగృహాల నిర్మాణం,జగనన్న కాలనీలకు ఇసుక కొరత లేదని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జేపీ పవర్ వెంచర్స్‌ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా 200 రీచ్‌ల్లో శాండ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని అన్నారు.రోజుకు దాదాపు 2 లక్షల టన్నుల వరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. వర్షాకాలం కోసం ఇప్పటికే 50 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయడం జరిగిందని అన్నారు.అలాగే ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్ శాఖ క్లియరెన్స్‌తో పూడికగా ఉన్న ఇసుక నిల్వలను డ్రైజ్జింగ్ చేసి, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.జగనన్న కాలనీల్లో ఇసుక కోసం రీచ్‌లకు 40 కిలోమీటర్ల లోపు ఉన్న వారు ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు వారికి కూపన్లను ఇస్తున్నామని అన్నారు. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వారికి ప్రభుత్వమే కాలనీల వద్దకు ఇసుకను రవాణా చేస్తోందని తెలిపారు. బోట్స్‌ మెన్‌ సొసైటీలకు గతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండేదని, ప్రస్తుతం కూడా అలా అనుమతులు కావాలని వారు కోరుతున్న మాట వాస్తవమేనని అన్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నామని, సహేతుకమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.