Site icon vidhaatha

గెలిచే మ్యాచ్‌లో ఓట‌మి బాట ప‌ట్టిన టీమిండియా..సిరీస్ ద‌క్కించుకున్న ఆసీస్

భార‌త పురుషుల జ‌ట్టు క్రికెట్ అభిమానుల‌ని తీవ్ర నిరాశ‌ప‌రుస్తుండ‌గా, ఇప్పుడు మ‌హిళ‌ల జ‌ట్టు సైతం అదే బాట‌లో ప‌య‌నిస్తుంది. ఆస్ట్రేలియా మహిళలతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా వ‌రుస‌గా రెండు ప‌రాజయాలు చెంది సిరీస్ కోల్పోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హర్మన్‌ప్రీత్ సేన.. ఓడిపోవ‌డంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో సిరీస్ కోల్పోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో చెత్త ఫీల్డింగ్.. పేలవ బ్యాటింగ్‌తో చేతులోకి వ‌చ్చిన మ్యాచ్‌ని మూడు పరుగుల తేడాతో కోల్పోయింది. ముంబై వేదికగా శనివారం (డిసెంబర్‌ 30) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే జ‌ర‌గగా, ఈ మ్యాచ్‌ల తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది.

ఇక ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ 96 పరుగులతో చెలరేగినా 3 పరుగుల దూరంలో భారత్‌ విజయానికి బ్రేకులు ప‌డ్డాయి. స్కోరు 37 పరుగుల వద్ద భాటియా (14) కిమ్ గార్త్ దెబ్బకు పెవిలియన్‌ చేరింది. మంధాన కూడా 34 పరుగులకు పెవీలియ‌న్ బాట ప‌ట్టింది. అనంత‌రం రిచా, జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరూ కలిసి 88 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను ఆదుకునే ప్ర‌య‌త్నం చేసారు. స్కోర్ బోర్డ్ మెల్ల‌మెల్ల‌గా ప‌రుగులు పెడుతున్న స‌మంలో 44 పరుగులు చేసిన జెమీమాను ఔట్‌ చేసి జార్జియా ఆసీస్‌కు బ్రేక్‌ ఇచ్చింది.

ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఐదు పరుగులు మాత్రమే చేసి పెవీలియ‌న్ బాట ప‌ట్టింది. అనంత‌రం దీప్తి, రిచా ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండ‌గా, దీప్తి తొలి బంతికే ఫోర్ కొట్టి జట్టు ఆశలు రేపింది. అయితే అష్లే గార్డనర్ 49వ ఓవర్‌ కట్టడిగా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయడంతో పాటు 3 పరుగులే ఇవ్వ‌డంతో టీమిండియా ఓట‌మి ఖాయమైంది.భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, శ్రేయాంక పాటి, స్నేహ్ రాణా తలో వికెట్ తీయగా.. దీప్తి శర్మ(5/38) ఐదు వికెట్లు పడగొట్టింది. ఇక ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో ఫొబే లిట్చిఫీల్డ్(98 బంతుల్లో 6 ఫోర్లతో 63), ఎల్లిస్ పెర్రీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Exit mobile version