Site icon vidhaatha

Gold Rate | హతవిధి..! పెరుగుతున్న పసిడి ధరలతో సామాన్యుల బెంబేలు..!

gold-rate

Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇస్తూనే ఉన్నాయి. తాజాగా బులియన్‌ మార్కెట్‌లో ధరలు మరోసారి భారీగా పెరిగాయి. రోజు రోజుకు బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 పెరగ్గా.. తులానికి రూ.66,100 ధర పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.380 పెరగడంతో 24 క్యారెట్ల పసిడి రూ.72,110కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,150కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,110కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,250 పలుకుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.61,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,110 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం భారీగా పెరిగింది. వెండి రూ.1000 పెరిగి కిలోకు రూ.85,500 ధర పలుకుతుండగా.. హైదరాబాద్‌లో కిలో ధర రూ.89వేలు ధర పలుకుతున్నది. బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌లో ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version