Varalakshmi Vratham | శ్రావణ మాసం( Shravana Masam ) కొనసాగుతోంది. ఈ శుక్రవారం(ఆగస్టు 16) రోజున వరలక్ష్మీ వ్రతం( Varalakshmi Vratham ) చేసుకునేందుకు మహిళా భక్తులు( Devotees ) సిద్ధమవుతున్నారు. ఆ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి( Lakshmi Devi )ని పూజిస్తే.. ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, గజ లక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, వీర లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, విద్యా లక్ష్మిగా నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఈ ఎనిమిది రూపాల ఏక స్వరూపమే వరలక్ష్మీదేవి.
కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎల్లుండి వరలక్ష్మీ వ్రతం చేసి మనస్పూర్తిగా కోరికలు కోరుకుంటే.. నేరవేరతాయని భక్తుల నమ్మకం. అయితే.. వరలక్ష్మీ వ్రతం చేసే మహిళా భక్తులు.. ఏ రంగు చీర కట్టుకుంటే మంచిది? లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి రోజూ ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు భక్తితో ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చు. అయితే.. శ్రీశుక్తంలో మొదటి శ్లోకం ప్రకారం.. లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే ఇష్టం. బంగారు వర్ణంలో ఉండే చీరను ధరించి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు కూడా ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీకటాక్షం కోసం ఆకు పచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు. లక్ష్మీదేవికి గులాబీ రంగు కూడా చాలా ఇష్టం. ఈ చీరను ధరించి వరలక్ష్మీ వ్రతం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం..
పద్మాపురాణం ప్రకారం.. లక్ష్మీదేవి అగ్ని నుంచి జన్మించినట్లుగా చెబుతారు. అందుకే.. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రతిరోజు లేదా మంగళ, శుక్రవారాల్లో ఆగ్నేయ మూలలో ఇంట్లో దీపం వెలిగిస్తుండాలి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఆగ్నేయ మూలలో పీట పెట్టి, అష్టదళ పద్మం ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు రోజూ నీళ్లతో అభిషేకం చేయండి. వట్టి వేళ్ల నీళ్లలో కలిపి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. మారేడు దళాలతో లక్ష్మీ దేవిని పూజించండి. వీలైతే పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఆరాధించండి. ఇలా చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.