Throat problem : గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. గొంతులో గరగర, భరించలేని గొంతు నొప్పి, గొంతులో మంట లాంటి సమస్యలు మనలను కుదురుగా ఉండనివ్వవు. ఈ గొంతు సంబంధ బాధను మాటల్లో వర్ణించలేం. ఏది తిన్నా రుచించదు. గొంతు నొప్పిగా ఉన్నప్పుడైతే మంచినీళ్లు మింగబోయినా ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది.
కొంతమందికి చల్లటి నీళ్లు తాగినప్పుడు లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తిన్నప్పుడు గొంతు సమస్యలు వస్తాయి. కొందరికి చల్లటి పదార్థాలతో పెద్దగా సమస్యలు రాకపోయినా పానీపూరి, బజ్జీలు, మిర్చీలు లాంటి బయటి ఫుడ్స్ తిన్నప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా గొంతుకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే ఉపశమనం కలిగించే వంటింటి చిట్కా ఒకటి ఉంది. మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా..?
గొంతులో సమస్య ఉన్నప్పుడు ఒక పాత్రలో పావు లీటర్ నీళ్లు పోసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, ఓ పదీ పన్నెండు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ మరిగించిన నీటిని వడకట్టి తీయదనం కోసం ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. అయితే.. మధుమేహం ఉన్నవాళ్లు మాత్రం తేనెను కలుపకపోయినా పర్వాలేదు. ఈ చిట్కా గనుక పాటిస్తే క్షణాల్లోనే మీ సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే ఉపశమనం లభిస్తుంది.