విధాత, హైదరాబాద్ : నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని..నేనేంటో దేశ ప్రజలకు తెలుసని తెలంగాణ మంత్రి మహమ్మద్ అజారుద్ధీన్ వ్యాఖ్యానించారు. మంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రిగా అజారుద్ధీన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలంటూ బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఈ సందర్బంగా అజారుద్దీన్ స్పందించారు.
నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని..ఎవరో చేసిన కామెంట్స్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నాపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని..బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలు సరైనవి కావు. నా గురించి కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదు. నాపై ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు అని అజార్ గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రిగా ప్రమాణం చేసినందుకు సంతోషంగా ఉందని..ఇందుకు పార్టీ హైకమాండ్ కు, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నాకు ఏ శాఖ ఇచ్చినా నిబద్ధతతో పని చేస్తాను.. నాకు ఏ శాఖ ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.
