విధాత : బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్బిణి మహిళ అకస్మాత్తుగా పురిటినొప్పులు పడి బస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా..పుట్టిన బిడ్డను గుడ్డలో చుట్టి బస్సు కిటికి గుండా రోడ్డుపైకి విసిరేసిన అమానవీయ ఘటన సంచలనం రేపింది. మహారాష్ట్రలో జరిగిన ఈ దారుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గర్భిణి రితికా ధేరే తన భర్త అల్తాఫ్ షేక్లు 18 నెలలుగా పుణెలో ఉంటున్నారు. వారిద్ధరు స్లీపర్ కోచ్లో పుణె నుంచి పర్భాణికి బస్సులో బయల్దేరారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. బస్సులోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనూహ్యంగా భర్త ఆ పసిబిడ్డను ఓ గుడ్డలో చుట్టి బస్సు కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. ఇది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సు ఆపి.. ఏం విసిసేరాశావని అల్తాఫ్ను ప్రశ్నించగా..అతను సమాధానం దాటవేశాడు.తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు.
అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను పురమాయించి ఆ దంపతులు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. అయితే అప్పటికే ఆ పసికందు మరణించింది. వెంటనే ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించగా..వారు మార్గమధ్యలో బస్సు వద్ధకు చేరుకుని రితికా, అల్తాఫ్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. తమకు బిడ్డను పోషించే స్థితి లేకనే ఈ దారుణానికి పాల్పడినట్లు దంపతులు తెలిపారు. వారిద్దరు భార్యభర్తలు అనేందుకు వారి వద్ధ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు బాలింత యువతిని ఆస్పత్రికి తరలించి అతడిని రిమాండ్ కు తరలించారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.