పాకిస్థాన్ :
ఢిల్లీలో కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ.. పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా మారాయి. పాకిస్థాన్ లోయ ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, “తూర్పు సరిహద్దులో భారత్తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది’ అని ఖవాజా అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి వేళ పాక్ రక్షణశాఖా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘మేము అఫ్ఘనిస్తాన్, భారత్.. రెండు దేశాలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో అల్లా మాకు సహాయం చేశాడు. రెండో రౌండ్లో కూడా అదే జరుగుతుందనే విశ్వాసం ఉంది” అని పేర్కొన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన 24 గంటల ముందే అంటే మంగళవారం ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12 మంది మరణించగా, 36 మంది గాయపడ్డారు. ఆ దాడికి పాకిస్తాన్ తాలిబన్ (TTP) బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఈ పరిణామాల మధ్య పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో దాయాది సర్కారుపై ప్రజల్లో ఆగ్రహం, భద్రతా లోపాలపై విమర్శలు తీవ్రతరమయ్యాయి.
ఈ క్రమంలో ఆసిఫ్ ఢిల్లీ పేలుడు ఘటనపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అది కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమే. దానిని ఉగ్రదాడిగా చూపిస్తూ భారత్ మళ్లీ పాకిస్తాన్పై దాడికి సిద్ధమవుతోంది. ఢిల్లీ బ్లాస్ట్ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ వాడుకుంటోంది” అని పాక్ మంత్రి ఆరోపించారు. భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ పేలుడును తీవ్ర ఉగ్రదాడిగా పేర్కొన్నప్పటికీ, ఆసిఫ్ వ్యాఖ్యలు ఆ దాడిని తేలికగా తీసుకున్నట్టుగా కనిపించాయి. భారత నిపుణుల ప్రకారం, పాకిస్తాన్ ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పాక్ లో అంతర్గత అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఉగ్రదాడుల పెరగడం దేశ భద్రతను సవాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమేనని స్ఫష్టమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేతులో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసిఫ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు.
