అనుచరులలోనే హడావుడి.. అసమ్మతివాదులు దూరం Nalgonda | విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు అన్నింటిలోనూ సిటింగ్ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు దక్కడం పట్ల బీఆరెస్ శ్రేణుల్లో సంబరాలు వెల్లువెత్తుతాయన్న దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో వాతావరణం కనిపిస్తుంది. సిటింగ్ ఎమ్మెల్యేల అనుచరులు తప్ప సొంత పార్టీలోని అసంతృప్తి, అసమ్మతి నేతలు, వారి అనుచర వర్గాలు టికెట్లు సంబరాలకు దూరంగా ఉంటున్నారు. కాగా.. తమకు టికెట్లు రావేమోనన్న […]
Nalgonda |
విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు అన్నింటిలోనూ సిటింగ్ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు దక్కడం పట్ల బీఆరెస్ శ్రేణుల్లో సంబరాలు వెల్లువెత్తుతాయన్న దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో వాతావరణం కనిపిస్తుంది. సిటింగ్ ఎమ్మెల్యేల అనుచరులు తప్ప సొంత పార్టీలోని అసంతృప్తి, అసమ్మతి నేతలు, వారి అనుచర వర్గాలు టికెట్లు సంబరాలకు దూరంగా ఉంటున్నారు.
కాగా.. తమకు టికెట్లు రావేమోనన్న అనుమానాలు ఉన్న నాగార్జునసాగర్, నల్లగొండ, కోదాడ, మునుగోడు, దేవరకొండలతో పాటు టికెట్లపై నమ్మకం ఉన్న నకిరేకల్, సూర్యాపేట, హుజూర్నగర్ సహా ఇతర నియోజకవర్గాలలో మాత్రం బీఆరెస్ తొలి జాబితా వెలువడగానే వారి అనుచరులు సంబరాలతో హడావిడి చేశారు. అయితే వారి వ్యతిరేక వర్గాలు మాత్రం ఈ సంబరాలకు దూరంగా ఉండటం గమనార్హం. నిజానికి నాగార్జునసాగర్, కోదాడ, నల్లగొండ, మునుగోడు, దేవరకొండలలో అభ్యర్థులను మారుస్తారని మొన్నటి దాకా గట్టి ప్రచారమే సాగింది.
అయితే సీఎం కేసీఆర్ సిటింగ్ లకే టికెట్లన్న నిర్ణయంతో జిల్లాలోని సిటింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు వరించాయి. కోదాడ, నాగార్జునసాగర్ సిటింగ్ ల టికెట్లను మారుస్తారని భావించినప్పటికి ఉమ్మడి జిల్లాలో ఇతర స్థానాల్లో మార్చకుండా బీసీ సిటింగ్ స్థానాల్లోనే మార్చారన్న అపవాదు వస్తుందన్న కోణంలో అనివార్యంగా సీఎం కేసీఆర్ నోముల భగత్, బొల్లం మలయ్య యాదవ్లకు టికెట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్ బలంగా ఉన్నఈ జిల్లాలో ఎన్నికలకు మరో వంద రోజులు అటు ఇటుగా సమయం ఉండడంతో అసంతృప్తులను సర్దుబాటు చేసుకుంటేనే సిటింగ్లకు సానూకూతల ఉండనుంది.
సూర్యాపేట నియోజకవర్గంలో
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డికి నాల్గవసారి ఆ పార్టీ టికెట్ దక్కింది. గతంలో ఒక పర్యాయం హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన జగదీశ్ రెడ్డి అక్కడ ఓటమి చెందారు, స్వరాష్ట్రంలో 2014, 2018 ఎన్నికల్లో మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో గెలుపొందారు. మంత్రిగా ఆయన హాయాంలో జిల్లాగా మారిన సూర్యాపేట పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడంతో ఆయన హ్యాట్రిక్ విజయ సాధన పై ధీమాగా ఉన్నారు.
సొంత పార్టీలో అంతర్గత అసంతృప్తి కొంత ఉన్నప్పటికి ఆయన విజయానికి సమస్యగా మారే స్థాయిలో మాత్రం లేదు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డితో, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావులతో ఎన్నికల బరిలో మరోసారి త్రిముఖ పోటీ ఎదుర్కోబోతున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధితో పాటు త్రిముఖ పోటీ జగదీశ్రెడ్డి గెలుపుకు మరోసారి కలిసొస్తుందని నమ్ముతున్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో
హుజూర్నగర్ సిటింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మళ్లి టికెట్ దక్కించుకున్నారు. ఆయన వ్యతిరేకవర్గ మాత్రం దాన్ని జీర్ణించుకోలేక పోతుంది. ఎన్నికల నాటికి అసంతృప్తి సర్దుబాటు చేసుకుంటేనే ఆయనకు విజయా అవకాశాలు మెరుగవుతాయంటున్నారు. ఇక్కడ పీసీసీ మాజీ చీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థిని సైదిరెడ్డి ఎదుర్కోవాల్సి ఉంది. ఉప ఎన్నికల్లో గెలుపు పిదప ఎమ్మెల్యే వ్యవహారశైలి మారిందన్న అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేకత సైదిరెడ్డికి ప్రతికూలంగా కనిపిస్తున్నప్పటికి ఎన్నికల నాటికి పరిస్థితులన్ని సానుకూలంగా మారుతాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు..
కోదాడ నియోజకవర్గంలో
కోదాడ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్పై నియోజకవర్గం బీఆరెస్ పార్టీలో, ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారాన్ని పక్కన పెట్టి సీఎం కేసీఆర్ మళ్లీ ఆయనకే టికెట్ కేటాయించారు. టికెట్ దక్కించుకున్న సంబరం కంటే అసమ్మతి నాయకులు కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపపల్లి చందర్రావు, ఎర్నేని బాబులను, మండలాల్లోని వారి అనుచరులను తనదారికి తెచ్చుకోవడం బొల్లంకు సవాల్ గా తయారైంది. బీఆరెస్ అధిష్టానం మల్లయ్యకే మళ్ళీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో వారంతా తిరుగుబాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీఫామ్ వచ్చేనాటికి పరిస్థితి తమకే అనుకూలంగా ఉండవచ్చని శశిధర్ రెడ్డి వర్గం భావిస్తుంది.
తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గంలో
తుంగతుర్తి లో వరుసగా మూడోసారి గాదరి కిషోర్ కే టికెట్ దక్కగా, ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలో బలమైన అసమ్మతి నేతలు ఎవరు లేకపోవడం, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం బలమైన అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడం ప్రస్తుతానికి ఆయనకు సానుకూలంగా ఉంది. అంతమాత్రాన ఆయన అప్పుడే గెలిచినట్లు కాదని, సాండ్, ల్యాండ్, మైన్, వైన్, సంక్షేమ పథకాలలో అవినీతి వంటి అంశాలలో ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణలను, నాన్ లోకల్ అంశాలను ప్రతిపక్షాలు తమ ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ఎన్నికల్లో ముఖాముఖీ పోటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. సొంత పార్టీలో చాపకింద నీరులా ఉన్న అసమ్మతి ఎన్నికల నాటికి బహిర్గతం కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు.
నకిరేకల్( ఎస్సీ ) నియోజకవర్గంలో
నకిరేకల్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆరెస్లో చేరిన సిటింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో గత ఎన్నికల్లో లింగయ్య పై బీఆరెస్ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్ అసలు గల్లంతవ్వగా, ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆరెస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇచ్చినప్పటికీ గెలుపు పై ధీమాగా ఉన్న వీరేశం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపుతుండటం లింగయ్యకు సమస్యగా తయారైంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షణలోని ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కాలంటే ఆయన ఆశీస్సులు కావాల్సివుంది. గతంలో వీరేశం చేరికను వెంకట్రెడ్డి వ్యతిరేకించారు. వెంకట్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే… వీరేశం కాంగ్రెస్లో చేరితే, ఇప్పటిదాకా కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెట్టుకున్న దైద రవిందర్, కొండేటి మల్లయ్య, వేదాసు వెంకయ్యలకు నిరాశ తప్పదు.
భువనగిరి నియోజకవర్గంలో
భువనగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికే వరుసగా మూడోసారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. శేఖర్ రెడ్డికి సొంత పార్టీలో అసమ్మతి బెడద లేకపోవడం, ఇంతకాలం కాంగ్రెస్ నుంచి ప్రత్యర్ధిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇటీవల పార్టీలో చేరడం పైళ్ల గెలుపుకు మరింత కలిసిరానుంది. ఇక కాంగ్రెస్ బీసీ అభ్యర్థి అస్త్రం ఇక్కడ ఎంత మేరకు ఆ పార్టీకి కలిసొస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నుండి పంజాల రామాంజనేయులుగౌడ్ ప్రస్తుతం టికెట్ రేసులో ఉన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో
సిటింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికే వరుసగా మూడోసారి టికెట్ కేటాయించారు. అయితే మహేందర్ రెడ్డి భర్త కూడా టికెట్ ఆశించినప్పటికీ కేసీఆర్ మరోసారి ఆమెకే అవకాశం ఇచ్చారు. సునితకు పోటీగా సొంత పార్టీలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ లు టికెట్ రేసులో ఉన్నప్పటికీ వారు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, యాదాద్రి నిర్మాణం వంటి అంశాలు ఆమెకు సానుకూలంగా ఉన్నాయి.
అయితే హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధపడిన సునీత ముందుగా సొంత పార్టీ నేతలు మోత్కుపల్లి, బూడిదలను, మండల స్థాయిలోని అసమ్మతి వాదులను సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అలాగే ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండనున్న బీర్ల ఐలయ్య యాదవ్ నుంచి ఈ దఫా గట్టి పోటీ ఎదుర్కోవాల్సివుంది.
మునుగోడు నియోజకవర్గంలో
మునుగోడులో 2014లో గెలిచి, 2018లో ఓడి, 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన సిటింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే నాలుగోసారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ దఫా ఇక్కడ బీసీకే టికెట్ ఇవ్వాలని జడ్పీటీసీ రవి ముదిరాజ్ తో పాటు పల్లె రవి గౌడ్, కర్నాటి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజులు గట్టి ప్రయత్నాలే చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిలు కూడా ఈ టికెట్ ఆశించారు.
అయితే సిటింగ్లకే టికెట్లన్న కట్టుబాటుతో కూసుకుంట్ల పై ప్రజా వ్యతిరేకతను, పార్టీలోని వ్యతిరేకతను పక్కనపెట్టి కేసీఆర్ మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై అతికష్టంగా గెలిచిన కూసుకుంట్ల ఈ దఫా గెలుపు కోసం మరింత శ్రమించాల్సి ఉంది. రాజగోపాల్ రెడ్డి లేదా ఆయన భార్య లక్ష్మి వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి లేదా చలమల కృష్ణారెడ్డి రంగంలో ఉండనుండగా, సీపీఐ, కాంగ్రెస్తో పొత్తు కుదిరితే బలమైన పోటీదారుగా మారనుంది. సీపీఐ సొంతంగా పోటీ చేస్తే నాలుగు స్తంభాలాటలో ఓట్లు చీలితే గెలుపు తమదేనని బీఆరెస్ నమ్ముతుంది. కూసుకుంట్లకు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వచ్చే ఎన్నికల ప్రచారంలో ఇబ్బందిపెట్టనున్నాయి.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో
నల్గొండలో సిటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికే వరుసగా రెండోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. జిల్లాలో ఇక్కడ అభ్యర్థి మార్పు తప్పక ఉంటుందని మొన్నటిదాకా అంతా భావించారు. జనంలో వ్యతిరేకత, సొంత పార్టీలో అసమ్మతి చాడా కిషన్ రెడ్డి, పిల్లి రామరాజు, గుత్తా అమిత్ రెడ్డిలు టికెట్ రేసులో ఉండడంతో కంచర్ల టికెట్ ను ప్రశ్నార్థకం చేశాయి. సిటింగ్లకే టికెట్లు అన్న కేసీఆర్ విధానంతో మళ్లీ కంచర్లకే టికెట్ దక్కింది.
అయితే టికెట్ దక్కిందన్న సంబరం కంటే బలమైన అసమ్మతి నేతలతో పాటు ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ఎన్నికల్లో కంచర్లపై ఓడిన సానుభూతి ఉన్న కాంగ్రెస్ ప్రత్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎదుర్కోవడం కంచర్లకు సవాల్గా మారనుంది. టికెట్ ఆశించి భంగపడిన పిల్లి రామరాజు, కిషన్రెడ్డిల భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది కూడా కంచర్ల జయపజయాలపై ప్రభావితం చూపనున్నాయి. అయితే నల్లగొండలో చేసిన అభివృద్ధినే తనను గెలిపిస్తుందంటు కంచర్ల ధీమాగా ఉన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో
మిర్యాలగూడలో సిటింగ్ ఎమ్మెల్యే నలమోతు భాస్కరరావుకు ఇక్కడ రెండోసారి బీఆరెస్ నుంచి పోటీ చేయబోతున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆరెస్లో చేరిన భాస్కరరావు, 2018లో బీఆరెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సొంత పార్టీలో పెద్దగా ఆయనకు అసమ్మతి సమస్యలు లేకపోయినా, కాంగ్రెస్ నుంచి తన రాజకీయ గురువు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి రూపంలో బలమైన అభ్యర్థుల నుంచి ఆయన పోటీ ఎదుర్కోబోతున్నారు. అలాగే సీపీఎం పోటీ చేస్తే మాత్రం భాస్కర్ రావుకు త్రిముఖ పోటీ తప్పదు. త్రిముఖ పోటీ తనకే లాభమని ఆయన భావిస్తున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో
నాగార్జునసాగర్ లో గత ఉప ఎన్నికల్లో గెలిచిన సిటింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కే మల్లి టికెట్ దక్కింది. ఇక్కడ అభ్యర్థిని మారుస్తారని గట్టి ప్రచారం జరిగినప్పటికి బీసీ అభ్యర్థిని మార్చారన్న అపవాది ఎందుకన్న కోణంలో, సిటింగ్లకే టికెట్లు అన్న కట్టుబాటుతో సీఎం కేసీఆర్ మరోసారి భగత్ కే టికెట్ ఇచ్చారు.
అయితే సొంత పార్టీ నుండి టికెట్ కోసం పోటీపడిన ఎమ్మెల్సీ ఎం.సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి ,మన్నెం రంజిత్ యాదవ్ లను కలుపుకొని పోవడం మాత్రం భగత్ కు పెద్ద తలనొప్పిగా మారనుంది. కాంగ్రెస్ నుంచి ఇక్కడ జానారెడ్డి లేదా ఆయన కుమారుడు జయవీర్రెడ్డితో భగత్ ఈ దఫా గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు.
దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో
దేవరకొండలో మరోసారి సిటింగ్ ఎమ్మెల్యే ఆర్. రవీంద్రకుమార్ కు టికెట్ దక్కింది. 2004, 2014లలో సీపీఐ నుంచి గెలిచిన రవీంద్ర కుమార్ బీఆరెస్లో చేరి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయనకు ఈ దఫా టికెట్ ఇవ్వవద్దంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహలు చివరి వరకు గట్టి ప్రయత్నాలు చేశారు.
సిట్టింగ్ లకే టికెట్లన్న కేసీఆర్ విధానంతో మళ్లీ రవీంద్ర కుమార్ కే టికెట్ దక్కింది. ఐదోసారి ఇక్కడి నుండి పోటీ చేయబోతున్న రవీంద్ర కుమార్ పట్ల జనంలో ప్రతికూలత కంటే ఎక్కువగా సొంత పార్టీ అసమ్మతినే ఆయనకు ఇబ్బందికరంగా తయారైంది. కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఎన్. బాలునాయక్, లేక కల్యాణ నాయక్ల నుంచి ఈ ఎన్నికల్లో రవీంద్ర కుమార్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.