CMD Prabhakar Rao
- మీడియా సమావేశంలో సీఎండీ ప్రభాకర్రావు
- 24 గంటల విద్యుత్తు సరఫరాపై దాటవేత
- తాను రాజకీయ నాయకుడిని కాదని వ్యాఖ్య
- ప్రెస్మీట్ మధ్యలోనే వెళ్లి పోయిన వైనం
విధాత: రాష్ట్రంలో రైతులకు ఎన్నిగంటల కరెంటు ఇచ్చామన్నది ముఖ్యం కాదని.. నాణ్యమైన కరెంటు ఇచ్చామా లేదా అన్నదే చూడాలని ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంటలు ఎండకుండా చూశామా లేదా అన్నదే ముఖ్యమని చెప్పారు. సోమవారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించారు.
లాగ్బుక్స్లో 24 గంటలు కరెంటు సరాఫరా కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చూపించారన్న ప్రశ్నకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ప్రభాకర్రావు.. తెలంగాణలో ఎక్కడా పంటలు ఎండిపోయినట్లుగా తమ దృష్టికి రాలేదంటూ సమాధానాన్ని దాటవేశారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, తనకు, కరెంటు సరఫరాకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. నాడు కరెంటు ఉంటే వార్త నేడు కరెంటు పోతే వార్త అంటూ సీఎం కేసీఆర్ సహా మంత్రులు తరచుగా చెప్పే డైలాగ్ను చెప్పి ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు.