హైదరాబాద్, విధాత: మైన్స్లో పనులను ప్రవేటీకరణ చేస్తున్నది సీఎం కేసీఆర్ అని ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణపై బహిరంగ చర్చకు రావాలని ఈటల సవాల్ విసిరారు. చర్చకు రాకపోతే మాట్లాడే అర్హత మీకు ఉండదన్నారు.
సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నా కూడా ఏనాడూ విధివిధానాలలో, పాలసీలలో ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదన్నారు. విధివిధానాల రూపకల్పనలో మా ప్రమేయం లేనప్పుడు ఎలా ప్రైవేట్ పరం చేస్తామంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వచ్చినప్పుడు ప్రధాన మంత్రి మోడీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి రూ. 6300 కోట్లు ఇచ్చి పునరుద్ధరించింది కేంద్రమే అని మర్చిపోవద్దన్నారు.
యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఇబ్బడి ముబ్బడిగా మైన్స్ కేటాయిస్తే సుప్రీం కోర్టు 216 మైన్స్ ను రద్దు చేసిందని తెలిపారు. ఆరువాత ఎంఎం ఆర్ ( mines and minarals development and regulation act) చట్టం- 1957 ను సవరించి సీఎంఎస్పీ
( coal mines special provosion) act- 2015 తీసుకువచ్చారని, దీనికి అప్పటి TRS పార్టీ పార్లమెంట్ లో పూర్తి మద్దతు ఇచ్చిందని ఈటల తెలిపారు.
ఈ చట్టం ప్రకారం.. గనుల కేటాయింపులు రిజర్వేషన్, ఆక్షన్ పద్దతిలో కేటాయించ బడుతాయని తెలిపారు. ఈ సవరణ చట్టం ద్వారానే మూడు గనులు న్యూ పాత్రపద(760), నయిని( 455), పెనగడప (41) మిలియన్ టన్నులు) మొత్తం కలిపి 1200 మిలియన్ టన్నులు పైగా గనులను కేంద్రం సింగరేణికి కేటాయించిందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న నాలుగు మైన్స్ కేకే6, శ్రవణపల్లి, కేఓసీ-III, సత్తుపల్లి మైన్స్ కోసం 2019 లోపు సింగరేణి దరఖాస్తు చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకొని ఉంటే కేంద్రం ఇచ్చేదని ఈటల తెలిపారు.
సింగరేణి దరఖాస్తు చేసుకోకపోవడం వల్లనే కొత్త చట్టం ప్రకారం 2021 లో ఈ నాలుగు మైన్స్ కి టెండర్ పిలిచారని తెలిపారు. అలకేషన్ పద్దతి ఉన్నప్పుడు సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దరఖాస్తు చేసుకోలేదో సమాధానం చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ చౌకబారు ప్రచారం మానుకోవాలని ఈటల కేసీఆర్కు హితవు పలికారు.
కోల్ మైన్ సిస్టమ్ ప్రైవేట్ పరం అనా? సింగరేణి ప్రివైటేశన్ నా? దేనికి మీ అభ్యంతరం ఉందో స్పష్టం చేయాలని ఈటల సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. అయితే బహిరంగ చర్చకు రండి, లేదంటే మాట్లాడడం మానేయండి.
తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణిలో 63 వేల మంది పర్మినెంట్ కార్మికులు ఉంటే ఇప్పుడు 43 వేల మందికి పడిపోయారన్నారు. అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు 20 వేల మంది ఉంటే ఇప్పుడు 30 వేలు అయ్యారని, ఎవరు సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఎందుకు తాడిచర్ల మైనింగ్ బొగ్గు తీయడం సింగరేణికి చేతకాదని రాసి ఇచ్చారని ఈటల ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో తాడిచర్ల మైన్ ను ప్రైవేట్ కి ఇచ్చారనీ తాను లొల్లి చేసిన స్పీచెస్ అసెంబ్లీ లో ఉంటాయన్నారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేసి జెన్కో కి ఇస్తే.. ఇప్పుడు కెసిఆర్ దానిని ఏఎం ఆర్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. సింగరేణికి ఎలా వయబుల్ కాలేదు.. అందులో ఉన్న మతలబు ఎమిటో అని అన్నారు. వీటిమీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
వాస్తవాలు, చైతన్యం, పోరాటం కేసీఆర్ కి పడవని,సీఎం అయ్యాక వాటిని చంపేస్తున్నారన్నారు. పొంగులేటితో చర్చలు జరుపుతున్నామని ఈటల తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో పురోగమించే పార్టీ బీజేపీనే అని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపించిందన్నారు.
కాంగ్రెస్కు బీఆర్ ఎస్ రూ. 25 కోట్లు ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్లు నాణానికి బొమ్మ బొరుసు లాంటివన్నారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తా అనే స్థాయికి ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చారన్నారు. దేశం అంతా డబ్బులు పెట్టే సత్తా మీకు ఎక్కడిది? ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కొల్లగొట్టి ఎవరికో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఈ సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురు బిక్షపతి, బీజేపీ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, పోరెడ్డి కిషోర్ రెడ్డి, సుధాకర్ శర్మ పాల్గొన్నారు