నా కుమారుడు నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడైనా పోటీకి సిద్ధం

నా కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డి నల్గొండ లేదా భువనగిరి లోక్‌సభ సీట్లలో ఎక్కడ టికెట్‌ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు

  • Publish Date - February 27, 2024 / 10:11 AM IST

  • సాగు తాగునీటీ కోసం కర్ణాటకను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలి
  • శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నా కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డి నల్గొండ లేదా భువనగిరి లోక్‌సభ సీట్లలో ఎక్కడ టికెట్‌ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆరెస్‌ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికీ టికెట్ ఇచ్చినా వారి గెలుపుకు సహకరిస్తామన్నారు.


రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. సమన్వయంతో పని చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అల్ టైమ్ అత్యధిక రికార్డ్ స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. గత పదియేండ్లు అత్యధిక వర్షపాతం నమోదు అవ్వడం వలన ప్రాజెక్టులు , చెరువులు ,కుంటలు , జలకళతో నిండు కుండల కనిపించాయని, పంటలు సమృద్ధిగా పండినాయన్నారు.


కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు వర్షాలు లేవని, తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, శ్రీశైలం ,నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీరులేకపోవడంతో ఆయకట్టు కింద క్రాఫ్ హాలిడేలు ప్రకటించారన్నారు. ప్రస్తుతానికి అన్నదాతలు బోర్ల కింద, బావుల కింద వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.


అయితే బోర్లు, బావులు ఎండిపోతూ భూగర్భ జలాలకు కొరత నెలకొందన్నారు. పొట్ట దశలో ఉన్న పంటలు అన్ని ఎండిపోతున్నాయన్నారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం, కర్ణాటకలోని వారి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే15 నుండి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తద్వారా సాగర్‌ ఆయకట్టులో ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని కోరుతున్నానని, కనీసం ఒక్క తడికైనా నీటిని అందించాలని కోరుతున్నానన్నారు. ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి నెల తర్వాత తెలంగాణలో మంచి నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాధలను ముందుగానే అర్థం చేసుకుని పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు.

Latest News