Medical College విధాత: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇక గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ […]
Medical College
విధాత: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇక గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తుమ్మలూరులో ఒక సబ్ స్టేషన్ను మంజూరు చేసి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో వస్తుంది.. మీ వరకు కూడా తెస్తాం. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అని కేసీఆర్ ప్రకటించారు.
మహేశ్వరం నియోజకవర్గంలో తుమ్మలూరులో దశాబ్ది సందర్భంగా రూ. కోటితో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు. దీనికి దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని నామకరణం చేయాలని కోరుతున్నాం. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నాం. జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున, బడంగ్పేట్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు.
ఇప్పటికే అనేక విజయాలు సాధించిన తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటు లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. అన్ని పనులు జరుగుతాయి.
మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు వస్తాయి. మహేశ్వరం దాకా మెట్రో రైలు ఆటోమేటిక్గా వస్తది. అటు బీహెచ్ఈఎల్.. ఇటు ఇక్కడి దాకా వస్తది. మళ్లీ మనమే గెలుస్తం.. అందులో డౌట్ లేదు. బ్రహ్మాండంగా మనమే ఉంటాం కాబట్టి.. ఒక పద్ధతిలో వచ్చే టర్మ్లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకుంటున్నాం. వారికి పెన్షన్లు పెంచాం. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పథకాలు పెట్టుకున్నాం. కులానికో, మతానికో, జాతికో సంబంధించి పథకాలను అమలు చేయడం లేదు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.
హరితహారంలో అనేక అద్భుతాలు జరిగాయి. తెలంగాణలో.. ప్రతి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్కులు కూడా రూపుదిద్దుకున్నాయి. ఈ విజయం మనందరి విజయం. సమిష్టి విజయం. ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పంచేందుకు ఒక వంద కోట్ల బడ్జెట్ అయినా పెట్టి ఫల వృక్షాలను పంచాలని నిర్ణయించాం అని కేసీఆర్ తెలిపారు.
ఫారెస్టు డిపార్ట్మెంట్ వారు చాలా కష్టపడి మన కోసం అడవులను పెంచుతున్నారు అని కేసీఆర్ తెలిపారు. కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారు. ఆ ఫారెస్టు అధికారి భార్యకు డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం కల్పించి, నియామక పత్రాన్ని అందజేశాం. కొంత డబ్బులు కూడా సాయం చేశాం. మనిషిని అయితే తేలేం. కానీ వారికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు హామీ ఇస్తున్నాను. మీ మీద దాడులు జరగకుండా ఉండేందుకు పోలీసు స్టేషన్ల మాదిరిగా ఫారెస్టు స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. ఒక 20 వరకు స్టేషన్లు అవసరం అవుతాయన్నారు. వాటిని వెంటనే మంజూరు చేద్దాం. ఫారెస్టు డిపార్ట్మెంట్ను పటిష్టం చేద్దాం అని కేసీఆర్ అన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో నీళ్ల కోసం పంచాయతీ ఉంది. పాలమూరు ఎత్తిపోతల కూడా కాళేశ్వరంతో పాటే పూర్తయ్యేది. కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు స్టేలతో ఆపుతున్నారు.
భగవంతుడి దయ వల్ల పాలమూరు ప్రాజెక్టు 85 శాతం పూర్తయింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. హామీ ఇస్తున్నాను.. 100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తాను. కృష్ణా నదిలో నీళ్ల కోసం పంచాయతీ ఉంది. గోదావరిలో నీళ్ల పంచాయతీ లేదు.
గండిపేట, హిమాయత్ సాగర్ వరకు గోదావరి లింక్ అయిపోతుంది. అక్కడ్నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పద్ధతిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తాను. చింత చేయాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ చెప్పారు.
మనకు భూమి, నీళ్లు, అడవులు ఉన్నాయి. విస్తృతంగా చెట్లు పెంచితే అపారమైన ఆక్సిజన్ లభిస్తుంది. అద్భుతమైన అవకాశం ఉన్న దేశంలో అడవులను నాశనం చేశారు. హరితహారం అనే చెబితే చాలా మందికి అర్థం కాలేదు. హాస్యాస్పదం చేశారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభలో జోకులు వేశారు.
హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది. అందరి కన్నా ముందుగా మన గ్రామ సర్పంచులను అభినందిస్తున్నాను. నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్లకు కోపం వచ్చింది. ఆ చట్టం వల్ల ఇవాళ గ్రామాలు పచ్చగా మారాయి. తెలంగాణలో దారులు అందంగా తయారయ్యాయని కేసీఆర్ తెలిపారు.