Infosys Narayan Murthy | ఢిల్లీ అత్యంత క్రమశిక్షణ లేని నగరమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఇక్కడ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని, అందుకే ఇక్కడికి రావడం అసౌకర్యంగా ఉంటుందన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. తాను ఢిల్లీకి వచ్చిన సమయంలో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, ఎందుకంటే ఈ నగరంలో క్రమశిక్షణా రాహిత్యం ఎక్కువగా ఉందన్నారు. ‘నిన్న నేను విమానాశ్రయం నుంచి వస్తున్నాను. సిగ్నల్లో రెడ్లైట్ ఉన్నప్పటికీ కార్లు, బైక్లు, స్కూటర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకువెళ్లాయి. మనం ఒకటి రెండు నిమిషాలు కూడా ఎదురుచూడకపోతే.. డబ్బు ముందు ఈ మనుషులు ఆగుతారా? అవకాశమే లేదు’ అని ఉదహరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ప్రాపర్టీ కంటే పబ్లిక్ సొత్తును మంచి మార్గంలో ఉపయోగించాలని, ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ పాలనలో అబద్ధాలు, మోసాలకు దూరంగా ఉండవచ్చన్నారు. దేశం ఉదారవాద పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలని, అదే సమయంలో కార్పొరేట్ ప్రపంచంలో సరైన విలువలను పెంపొందించడంపై మూర్తి నొక్కిచెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనుషులను భర్తీ చేయగలదని నమ్మడం తప్పని, మనిషి దీన్ని జరుగనివ్వడని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతనికి మనస్సు శక్తి ఉందన్నారు.