రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ.. తయారు చేయనున్న భూమి మేనిఫెస్టో విధాత: తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూమి ఆకాంక్షలు, న్యాయ అవసరాలు తెలుసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి తెలంగాణ భూమి కారవాన్ 2 యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభిస్తున్నట్లు లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2014లో భూమి హక్కులు, భూ పరిపాలనకు సంబంధించి ప్రజలు, రైతుల ఆకాంక్షలు తెలుసుకునేందుకు భూమి కారవాన్ 1 […]
విధాత: తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూమి ఆకాంక్షలు, న్యాయ అవసరాలు తెలుసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి తెలంగాణ భూమి కారవాన్ 2 యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభిస్తున్నట్లు లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2014లో భూమి హక్కులు, భూ పరిపాలనకు సంబంధించి ప్రజలు, రైతుల ఆకాంక్షలు తెలుసుకునేందుకు భూమి కారవాన్ 1 నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు 2,500 కిలోమీటర్లు పర్యటించి అందరి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాము. సుమారు 5వేల మందితో మాట్లాడి, తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో తయారు చేశామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
గత తొమ్మిది సంవత్సరాల పాలన నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలను తెలుసుకునేందుకు రెండోసారి భూమి కారవాన్ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందనే నిర్ణయానికి వచ్చాం. మలివిడత కారవాన్ ద్వారా రైతులను కలిసి భూ సమస్యల పరిష్కారానికి, మరింత మెరుగైన భూ పరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలి, సాగుకు సంబంధించి రైతుల న్యాయ అవసరాలు ఏమిటీ అనే అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ ప్రజల రెండో భూమి మేనిఫెస్టో రూపొందిస్తామని, రైతుల న్యాయ అవసరాలపై నివేదిక తయారు చేస్తామన్నారు. ఏప్రిల్ 10వ తేదీన భూమి కారవన్ పోచంపల్లి గ్రామంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు నల్లగొండ జిల్లా మల్లెపల్లికి చేరుకుంటుందని జీవన్ రెడ్డి తెలిపారు.