ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు నాయకత్వం అనిపించుకోవని..ఓ జిమ్మిక్కు మాత్రమేనని అన్నారు.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలను ఆయనే పాటించడం లేదని విమర్శించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు చెప్పిన మోదీ.. తానే స్వయంగా ఖరీదైన విమానంలో ఇటలీ వెళ్లారని విమర్శించారు. ఇటలీ ప్రధాని మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ ఇచ్చి రీల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశంలో గ్యాస్, ఎరువులు, ఇంధనాల సరఫరా పూర్తిగా ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయి…
ఆర్థిక తుపాను దేశం వైపు ముంచుకొస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మారేంతవరకూ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం త్వరలో తీవ్ర చమురు, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది. ఈ సంక్షోభాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడూ చూసి ఉండం. దీనినెవరూ ఆపలేరు. దీని ప్రభావం ఎవరిపై పడుతుందోనని, అయితే అదానీ, అంబానీలు వారి ప్యాలెస్లలో భద్రత మధ్య బాగానే ఉంటారు. కానీ మన రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతారు’’ అని పేర్కొన్నారు. మళ్లీ త్వరలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతారని, అన్ని రకాల ధరలు పెరిగిపోతాయని రాహుల్ హెచ్చరించారు.
మోదీ రిమోట్ కంట్రోల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఉందని రాహుల్ విమర్శించారు. మోదీ విదేశాలకు వెళ్లి ఎప్స్టీన్ ఫైళ్ల నుంచి తనను రక్షించాలని వేడుకుంటారని, అదానీని కాపాడాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ దేశ ద్రోహులు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాకు దేశాన్ని మోదీ అమ్మేశారని విమర్శించారు.
పాక్ చేతిలో కీలుబొమ్మగా రాహుల్…
ప్రధాని మోదీపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తిప్పికొట్టారు. ఆయన చేసే వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని..అక్కడి నేతలు చెప్పినట్లుగా ఆయన మాట్లాడతారని విమర్శించారు. ప్రధానిని అగౌరవపరచడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0.. GHOST SIM నెట్వర్క్ గుట్టురట్టు
మళ్లీ డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్ బిల్లు !
