సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త సీఎస్ సంజ‌య్ జాజు

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ అనంతరం సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 30, 2026, 3:47 pm IST
Read Time: 2 mins
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త సీఎస్ సంజ‌య్ జాజు

తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ‌య్ జాజు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని సంజ‌య్ జాజు కలిశారు. అనంతరం ఆయన నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఇదే రోజు పదవీ విరమణ చేయనున్న  సీఎస్‌ రామకృష్ణారావు పుష్చగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

రామకృష్ణారావు  స్థానంలో సంజయ్‌ జాజును ప్రభుత్వం కొత్త సీఎస్ గా నియమించింది. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ జాజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న సంజయ్‌ జాజును తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొంది. సంజయ్‌జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.