– పోలీసుల అభ్యర్థనతో హరియాణా కోర్టు నిర్ణయం
Jyoti Malhotra: యూట్యూబ్ వ్లాగర్, పాకిస్థాన్ లోని నిఘా సంస్థలకు సమాచారం చేరవేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రాకు హరియాణా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు ఆమెను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు అంశాలపై విచారించారు.
జ్యోతి మల్హోత్రాను మరికొన్ని రోజులు విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలపడంతో అందుకు కోర్టు అనుమతించింది. పాకిస్థాన్ కు చెందిన దర్యాప్తు సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మే 22న కోర్టు ఎదుట హాజరుపరిచారు. 2023 నుంచి ఆమె పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్ తో ఆమెకు పరిచయం ఉంది. ఈ క్రమంలోనే మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని జ్యోతి మల్హోత్రాకు పాకిస్థాన్ కు చేరవేసినట్టు తెలుస్తున్నది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమె పాకిస్థాన్ కు చెందిన అధికారులతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ అధికారులు సైతం ఆమెను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం జ్యోతి మల్హోత్రా కు సంబంధించిన మరిన్ని అంశాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.