విధాత : వివాదస్పద నిర్ణయాలతో, మాటలతో సొంత దేశం ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను సైతం తరచూ ఇరకాటంలో పెడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్, పాక్ సైనిక ఘర్షణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను తాను ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు కోల్పోయేవారంటూ వ్యాఖ్యానించారు.
‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా నా మొదటి 10 నెలల పాలనలో నేను ఎనిమిది యుద్ధాలను ఆపడం జరిగిందని , పాకిస్తాన్, భారతదేశం మధ్య సైనిక ఘర్షణలను ఆపకుంటే అణు యుద్ధం జరిగి ఉండేదని ట్రంప్ చెప్పుకున్నారు.
భారత్ పాక్ యుద్దాన్ని నేను ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ వెల్లడించారు. నేను పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రాణాలు కాపాడినట్లయ్యిందన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగి ఉంటే 3.5 కోట్ల మంది పాక్ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని షెహ్బాజ్ షరీఫ్ తనతో చెప్పారని వెల్లడించే క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తొమ్మిదవ యుద్దం అపే ప్రయత్నం చేస్తున్నానని, ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్దానికి ముగింపు పలికేందుకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
