Women World Cup 2025 | మహిళల వరల్డ్‌కప్‌ 2025: భారత్‌ సెమీఫైనల్‌ ఆశలు సజీవమేనా?

ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత కూడా భారత్‌ మహిళా జట్టు సెమీఫైనల్‌ ఆశలు మిగిలే ఉన్నాయా? మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిస్తే స్థానం ఖాయం, రెండు గెలిస్తే నెట్‌రన్‌రేట్‌ కీలకం. ఒకటే గెలిస్తే ఇంటిముఖం.

Women’s World Cup 2025: India’s Semi-Final Chances After Australia Loss

Women’s World Cup 2025: India’s Semi-Final Chances After Australia Loss

గువాహటి: ఆస్ట్రేలియాపై హోరాహోరి పోరులో ఓడటంతో, భారత్‌ మహిళా జట్టు సెమీఫైనల్‌ ఆశలపై అభిమానులకు సందేహాలు పుట్టుకొచ్చాయి. అసలు ఇండియా సెమీఫైనల్​కు చేరుతుందా? లేదా? అని.

మూడు మ్యాచ్‌లు.. మూడు అవకాశాలు…ఆరో బౌలర్

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్ల వద్ద ఉంది. ఇవాళ్టి బంగ్లాదేశ్​ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా విజయంతో  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్​ తన మూడోస్థానాన్ని సౌతీస్​కు త్యాగం చేసి నాలుగులో నిలిచింది. నెట్‌రన్‌రేట్‌ 0.682గా ఉండగా, ఇంకా మూడు లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. భారత్‌ తన మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిస్తే 10 పాయింట్లకు చేరి సెమీఫైనల్‌ స్థానం ఖాయం అవుతుంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే పాయింట్లు ఎనిమిదవుతాయి, అప్పుడు నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా లెక్కలు మారుతాయి. మూడింటిలో రెండు ఓడితే మాత్రం భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.

ఇంగ్లాండ్‌తో (ఇండోర్‌ – అక్టోబర్‌ 15), న్యూజిలాండ్‌తో (అక్టోబర్‌ 23), బంగ్లాదేశ్‌తో (నవి ముంబై – అక్టోబర్‌ 26) భారత్‌ తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై భారత్‌ తక్కువ తేడాతో ఓడినప్పటికీ, కొన్ని విభాగాల్లో బలహీనతలు స్పష్టమయ్యాయి. బౌలింగ్‌లో ఆరో ఆప్షన్‌ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

స్మృతి ఫామ్‌ తిరిగి రావడం శుభ పరిణామం

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో స్మృతి మంధాన అద్భుతంగా ఆడింది. కేవలం 66 బంతుల్లో 80 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటింది.
ఆమె బ్యాటింగ్‌ భారత్‌కు పెద్ద ఊతమవుతుందని క్రికెట్​ పెద్దలు భావిస్తున్నారు. హర్మన్‌ప్రీత్‌, రిచా ఘోష్‌ వంటి ప్రధాన బ్యాటర్లు రాణిస్తే భారత్‌ దూకుడు పెరుగుతుందనడం సందేహమే లేదు.

నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా నిర్ణయం వచ్చేటట్టయితే, భారత్‌కు చివరి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఎందుకంటే అప్పటికి మిగతా జట్ల పరిస్థితి స్పష్టమవుతుంది.  సెమీస్​కు అర్హత సాధించడానికి  భారత్‌కి కావాల్సిన నెట్​రన్‌రేట్‌ ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి, వ్యూహం రూపొందించుకోవచ్చు.

2022 వరల్డ్‌కప్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓటమి కారణంగా భారత్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి తప్పిపోయింది.
ఈసారి ఆ తప్పిదం పునరావృతం కాకుండా, జట్టు సమష్టిగా రాణించాలని హర్మన్‌ప్రీత్‌ సేన దృష్టి సారించింది.