విధాత, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ కుమార్తె ఆరోపణల ఆధారంగా డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని బెదిరించిన కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, మాజీ ఓఎస్డీ సుమంత్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు అందించారు.
రూ.100కోట్ల డీల్ లో డెక్కన్ సిమెంట్ యజమాన్యాన్ని రోహిన్ రెడ్డి, సుమంత్ లు తుపాకితో బెదిరించారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు, మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గన్ కల్చర్ అమలు చేస్తున్నారని, వసూళ్లు, వాటాల పంపకాలలో మంత్రులు తగదా పడుతున్నారంటూ వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఏకంగా పోలీస్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
