వెంటాడుతున్న పాత అప్పుల భారం
కొత్తగా తెచ్చిన అప్పులు రూ.17618 కోట్లు
వడ్డీలు సహా కిస్తుల చెల్లింపులకు రూ.25911 కోట్లు
ఆర్ధిక క్రమశిక్షణకు ప్రభుత్వం పెద్దపీట
విధాత: గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కింద ఇప్పటి వరకు ప్రతి రోజు రూ. 207 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చేసిన అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. ఆదాయం ఎంత వచ్చినా చిల్లు పడిన కుండ నిండని తీరుగా రాష్ట్ర ఖజానా ఉంది. ఎంత ఆదాయం పెరిగినా రోజు వారీ ఖర్చులకు సరిపోక కిస్తీలు చెల్లించడానికే కొత్త అప్పులు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నతీరుగా రేవంత్ రెడ్డి సీఎంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ, అసలు చెల్లింపుల కంటే తక్కువ అప్పులు చేస్తూ, నిదానంగా తెలంగాణ ప్రజలపై అప్పుల భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు పదేండ్లుగా విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందంటున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కింద రూ.25,911 కోట్లు చెల్లింపులు చేయగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత తెచ్చిన అప్పులు రూ.17,618 కోట్లని చెపుతున్నాయి.
ఖర్చులపై నియంత్రణ
గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని అధికార వర్గాలు చెపుతున్నాయి. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తోందని అంటున్నారు. గడిచిన పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలే తడిసిమోపెడయ్యాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు. అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ.17,618 కోట్ల అప్పులు చేసిందంటున్నారు. ఈ కాలంలోనే రూ.25, 911 కోట్లు అప్పులకు సంబంధించిన రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు) తిరిగి చెల్లింపులు చేసినట్లు అర్థిక శాఖ అధికార వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు కూడా సరిపోలేదంటున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రోజుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
కిస్తీల చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత
గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టమవుతోంది. పదేండ్లలో రాష్ట్ర ఖజానాపై మోయలేనంతగా పెరిగిన రుణభారం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న చర్చ అధికార వర్గాలలో జరుగుతోంది. వీటికి తోడుగా ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో రూ.5816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసిందంటున్నారు. గత ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించింది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరించింది.
తగ్గుతున్న అప్పులు
గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం శుభసూచకమని అధికార వర్గాలు చెపుతున్నాయి. కొంతమేరకు అప్పులను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందంటున్నాయి.
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలల్లో రూ.17,618 కోట్లు ప్రభుత్వం అప్పులు తీసుకుందని చెపుతున్నాయి. గత ప్రభుత్వం 2022–23 సంవత్సరం ఇదే వ్యవధిలో రూ.19,569 కోట్లు, 2021–22లో రూ.26,995 కోట్ల అప్పులు తీసుకున్నట్లు చెపుతున్నారు. 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 59,625 కోట్ల రుణాలను ప్రభుత్వం అంచనా వేయగా, అందులో ఇప్పటివరకు కేవలం రూ.2500 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.
రుణాలు తీసుకునే అవకాశం ఉన్నా..
గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగిందని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయటం కొత్త మార్పునకు సంకేతమని అంటున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తులు చెల్లించిందన్న చర్చ సచివాలయ వర్గాలలో జరుగుతోంది. తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు చేసింది ఎక్కువగా ఉండటం ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పట్టిందని అంటున్నారు.