విధాత : మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి తండ్లాటను బీఆరెస్ తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఈ సర్కారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ను తరిమికొట్టడం ఖాయమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో మృతదేహం లభించడంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరని, కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరని కేటీఆర్ విమర్శించారు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని మండిపడ్డారు. నాగార్జున సాగర్ వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయిన ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత.. కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమే జగతికి మూలం అని గుర్తుంచుకోండి అని తెలిపారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని ఎద్దేవా చేశారు.
తీరు మారకపోతే జనమే తరమికొడుతారు నల్లగొండ వాటర్ ట్యాంకు ఘటనపై కేటీఆర్ ట్వీట్
