తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర ఆర్ధిక, హోంశాఖల మాజీ మంత్రి పి.చిదంబర్ విమర్శించారు
విధాత: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర ఆర్ధిక, హోంశాఖల మాజీ మంత్రి పి.చిదంబర్ విమర్శించారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉందని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన రాష్ట్ర ఏర్పాటులో కీలకమైందన్నారు. విద్యార్థుల బలిదానాలు, సబ్బండ వర్గాల ప్రజల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.
రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అప్పులు బాగా పెరిగాయని, దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే అని, జాతీయ సగటు కన్న ఎక్కువ ద్రవ్యోల్బణం ఉందన్నారు. నిత్యావసరాల ధరలు, పాల ధరలు భారీగా పెరిగాయని, పెట్రోల్, డీజిల్,,గ్యాస్ ధరలూ ధరలూ ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయని, వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉందని, గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా రాష్ట్రంలో 15.1 శాతంగా ఉందన్నారు. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. టీ
ఎస్పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారని, వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. రాష్ట్ర అప్పులు 3.66 లక్షల కోట్లకు పెరిగిపోగా, ఏటేటా అప్పులు భారీగా పెరుగుతున్నాయని, ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడిందన్నారు. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారిందన్నారు. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయని, పోషకాహార లోపం తీవ్రంగా ఉందన్నారు. అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయని, కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.