Telangana Amarnath Yatra | దట్టమైన నల్లమల అడవుల్లో కొలువైన సలేశ్వరం లింగమయ్య జాతర( Saleshwaram Jathara )కు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణా నది నుంచి జాలువారే జలపాతాల మధ్య అటవీ జంతువుల కనువిందుల మధ్య సాగే ఈ యాత్ర తెలంగాణ అమర్నాథ్ యాత్ర(Telangana Amarnath Yatra )గా ప్రసిద్ధిగాంచింది.
ప్రతి ఏడాది ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా.. సలేశ్వరం జాతర ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండలను ఎక్కుతూ దిగుతూ 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి లింగమయ్యను దర్శించుకుని తరించిపోతారు భక్తులు. ఈ జాతర ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగనుంది.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. పర్హాబాద్ నుంచి పుల్లయపల్లి చెంచు పెంటల మీదుగా సుమారు 30 కిలోమీటర్లు బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించొచ్చు. ఆ తర్వాత కొండలు, రాళ్లను దాటుకుంటూ, జంతువుల నుంచి తప్పించుకుంటూ 4 కిలోమీటర్ల మేర నడిచి లింగమయ్య క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు.
