విధాత, హైదరాబాద్ : ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి లపై అనర్హత పిటీషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పును వెలువరించారు.
ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవంటూ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. అయిదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ చేసిన ఫిరాయింపు అభియోగాలను త్రోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లుగా బీఆర్ఎస్ చేసిన వాదనతో స్పీకర్ ఏకీభవించలేదు. ఈ నెల 18వ తేదీ లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయాన్ని వెలువరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పును వెలువరించడం విశేషం.
వారికి కూడా త్వరలోనే ఊరట
స్పీకర్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు భారీ ఊరట దక్కింది. అనర్హత వేటుకు నిరాకరణతో ఊరట పొందిన ఐదుగురు ఎమ్మెల్యేల తరహాలోనే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్రెడ్డిలకు త్వరలో అనర్హత వేటు తప్పవచ్చని భావిస్తున్నారు.
ఇకపోతే కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు మాత్రం స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో మరింత సమయం అడిగిన నేపథ్యంలో వారిపై నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
Shree Charani : మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్
Escalator Malfunction : ఎస్కలేటర్ రన్నింగ్..ప్రయాణికుల స్టన్నింగ్
