Wine Shops | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubilee Hills By Poll ) నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి అన్ని బార్లు, మద్యం షాపులు( Wine Shops ), కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు కూడా మూతపడనున్నాయి. ఈ ఆంక్షలు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు అంటే 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వైన్ షాపు, బార్లు, కల్లు దుకాణాల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలను పాటించాలని సూచించారు.
మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ..
నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీ పడగా, 2023 అసెంబ్లీలో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
భారీగా నామినేషన్లు ఎందుకంటే..?
ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ 12 మంది, యాచారం ఫార్మాసిటీ భూనిర్వాసితులు 10 మంది, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 10 మంది, ఉద్యోగ నియామక ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరపున 13 మంది, పెన్షన్లు సక్రమంగా రావడం లేదని పెన్షన్దారుల తరపున 9 మంది సీనియర్ సిటిజన్లు నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల తరపున ఒకరు నామినేషన్ వేశారు.
