Telangana DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్?
రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ తరువాత పోలీసు శాఖలో డీజీపీ పోస్టుకు ప్రాముఖ్యం, ప్రాధాన్యం ఉంది. గతేడాది జూలై నెలలో 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుండడంతో నూతన డీజీపీ ఎంపికకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది.

- కాదంటే శివధర్రెడ్డికి చాన్స్!
- ఐదుగురి పేర్లతో కేంద్రానికి జాబితా
(విధాత ప్రత్యేకం)
Telangana DGP | తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకం కోసం జాబితాను సిద్ధం చేశారు. డీజీపీ పోస్టు కోసం ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కేంద్రానికి పంపించాల్సి ఉండగా ఐదుగురి పేర్లను ఖరారు చేశారు. వీరి పేర్లను నేడో రేపో కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీకాలం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనున్నది. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ తరువాత పోలీసు శాఖలో డీజీపీ పోస్టుకు ప్రాముఖ్యం, ప్రాధాన్యం ఉంది. గతేడాది జూలై నెలలో 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుండడంతో నూతన డీజీపీ ఎంపికకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. ఈ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
సీనియార్టీ జాబితా ప్రకారం రవిగుప్తా (1990), సీవీ ఆనంద్ (1991), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994), బీ శివధర్ రెడ్డి (1994), సౌమ్యా మిశ్రా (1994), శిఖా గోయల్ (1994) పోటీలో ఉన్నారని సమాచారం. రవిగుప్తా రాష్ట్ర హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, ఆనంద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇక శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్నారు. సౌమ్యా మిశ్రా డీజీ (జైళ్లు), శిఖా గోయల్ సీఐడీ అడిషనల్ డీజీపీగా కొనసాగుతున్నారు. సెక్రటరీ రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాతి స్థానంలో సీవీ ఆనంద్ ఉన్నారు. ఆనంద్కు 2028 జూలై వరకు సర్వీసు ఉండటం కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది పదవీ విరమణ చేస్తుండగా, శివధర్ రెడ్డి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో, సౌమ్యా మిశ్రా 2027 డిసెంబర్ చివరన, శిఖా గోయల్ 2029 మార్చి నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆనంద్, శివధర్ రెడ్డి స్థానికులు కావడం మూలంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వీరిద్దరిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపవచ్చని పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చలు నడుస్తున్నాయి.
ఆనంద్కు రాష్ట్ర సర్వీసులతో పాటు కేంద్ర సర్వీసులో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. పైగా సౌమ్యుడనే ముద్ర ఉంది. ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించకుండా చట్టపరిధిలో వ్యవహరిస్తారనే పేరుండటం అదనపు అర్హతగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ డీజీపీ పదవికి మూడు పేర్లను మాత్రమే సిఫారసు చేస్తుంది. కానీ ఈసారి ఐదుగురి పేర్లను యూపీఎస్సీకి సిఫారసు చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పేర్లను పరిశీలించిన యూపీఎస్సీ.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేసింది. అందులో ఒకరిని ఎంపిక చేసి తిరిగి రాష్ట్రానికి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. పేరును ఖరారు చేసే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని హోం శాఖ పరిగణనలోకి తీసుకుటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. జాబితా సిద్ధం చేసే నాటికి రిటైర్మెంట్కు కనీసం ఆరు నెలల సర్వీసు ఉండాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2023 నవంబర్ నెలలో నిబంధన కొత్తగా తీసుకువచ్చింది.