ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతమైంది. ప్రభుత్వం ఓవైపు ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతోంది
– ఆందోళనలతో మరింత దూకుడు
– ప్రభుత్వ అల్టిమేటం, ఎస్మాకూ బేఖాతర్
– వెనక్కు తగ్గని అంగన్వాడీలు
– 27వ రోజూ కొనసాగిన నిరవధిక సమ్మె
– రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు ఉధృతం
– తెరచుకోని అంగన్వాడీలు.. లబ్ధిదారులకు అందని పౌష్టికాహారం
విధాత: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతమైంది. ప్రభుత్వం ఓవైపు ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు తగ్గేదేలా అంటూ అంగన్వాడీలు మరింత దూకుడు పెంచారు. ఏకంగా ఎస్మా ప్రయోగించినా బెదరలేదు. డిమాండ్లు నెరవేర్చక పోతే నిరవధిక నిరశన దీక్షలకూ వెనుకాడబోమంటూ హెచ్చరిక చేస్తున్నారు. రాజధాని అమరావతితో పాటు ప్రధాన నగరమైన విశాఖలో అంగన్వాడీల నిరసన మరింత జోరందుకుంది. జిల్లా కేంద్రాలూ ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. పలుచోట్ల నిరసన శిబిరాలు రాత్రిపూట కూడా కొనసాగాయి.
వణికించే చలిలోనూ అంగన్వాడీలు శిబిరాల్లోనే నిద్రించి, పట్టువీడకుండా ఆందోళనబాటలో ఉన్నారు. నిరసనలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నా వెనుకడుగు వేయకపోవడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఆదివారం నాటికి అంగన్వాడీల సమ్మె 27వ రోజూ కొనసాగింది. జగన్ ప్రభుత్వం దిగివచ్చే వరకూ దీక్షలు కొనసాగిస్తామంటూ భీష్మించారు. నల్ల జీవోలతో కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు.
ఉధృతమైన ఆందోళన
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆంధ్రప్రదేశ్ లో 27 రోజుల క్రితం ఆందోళన బాటపట్టారు. క్షేత్రస్థాయిలో ఆందోళనకారులను తొక్కిపెట్టినా, వెనక్కు తగ్గలేదు. అడుగడుగునా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తొలుత అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయినా అంగన్వాడీలు దిగిరాకపోవడంతో ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబర్ 2 జారీ చేసింది. ప్రభుత్వ చర్యలపై అంగన్వాడీలు మరింత రగిలిపోతున్నారు. ఆదివారం నుంచి మరింత దూకుడు పెంచి సమ్మెను ఉధృతం చేస్తున్నారు.
తెరచుకోని అంగన్ వాడీ కేంద్రాలు
– లబ్ధిదారులకు అందని పోషకాహరం
సమస్యల పరిష్కారం కోసం 27 రోజులుగా అంగన్వాడీలు రోడ్డెక్కారు. మొదటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్నారు. వినూత్న నిరససలతో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. జిల్లాకేంద్రాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. మరోవైపు సుమారు నెలరోజులుగా అంగన్వాడీ కేంద్రాలు తలుపులు తెరచుకోలేదు.
ఎక్కడివక్కడ మూతపడ్డాయి. తక్షణమే విధుల్లో చేరాలన్న ప్రభుత్వ అల్టిమేటంను, ఎస్మాస్త్రాన్ని అంగన్వాడీలు ఏమాత్రం లెక్కచేయడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె విరమణకు ససేమిరా అంటున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళనబాట వీడమంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల నుంచి లబ్ధిపొందుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం పలు ప్రాంతాల్లో స్థానిక అధికారుల సాయంతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి బలవంతంగా కేంద్రాలు తెరిచినా, స్థానికుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈపరిణామం అంగన్వాడీల నిరవధిక సమ్మె ప్రభుత్వానికి సంకటంగా మారగా, లబ్ధిదారులను గగ్గోలు పెడుతోంది. డిమాండ్ల సాధనకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రోడ్లమీదే ఉండిపోయారు.