కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి బస్తాలలో తెచ్చిన దస్త్రాలను కరకట్టపై పోసి తగులబెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది
విధాత : కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి బస్తాలలో తెచ్చిన దస్త్రాలను కరకట్టపై పోసి తగులబెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డు డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండగా, ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ16 ఈఎఫ్ 2596 నంబరు గల ఇన్నోవా కారులో నాగరాజు, రామారావులు కరకట్ట పైకి వచ్చారు.
ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం అందించారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న మంటలను ఆర్పి, దస్త్రాలను పరిశించారు. నిందితులు నాగరాజు, రామరావులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పనికిరాని దస్త్రాలను దగ్ధం చేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే తాము వాటిని తగులబెట్టినట్లుగా నిందితులు తెలిపారు.