కింగ్ కోబ్రా తిరిగి అడవిలోకి!

అనకాపల్లి శంకరం రిజర్వ్ ఫారెస్టులో 41 రోజుల సంరక్షణ అనంతరం 24 కింగ్ కోబ్రా పిల్లలను అటవీశాఖ అడవిలోకి విడుదల చేసింది. గిరినాగు సంరక్షణలో ఇది కీలక ఘట్టంగా నిలిచింది.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము జాతి అయిన ‘కింగ్ కోబ్రా’లు, భారతదేశంలోని తూర్పు కనుమలు (ఆంధ్రప్రదేశ్ & ఒడిశా), పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతం, అండమాన్ & నికోబార్ దీవుల వంటి కొన్ని అటవీ ప్రాంతాలలో మాత్రమే సహజంగా కనిపిస్తాయి. అంతరించిపోతున్న కింగ్ కోబ్రా(గిరినాగు) సంరక్షణ కోసం ఏపీ లోని శంకరం రిజర్వ్ ఫారెస్టు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు సాధిస్తున్నాయి.

తాజాగా అటవీ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంఘం (ఈజీడబ్ల్యుఎస్) ఆధ్వర్యంలో నిరంతరాయంగా 41రోజుల పాటు కింగ్ కోబ్రా గూడును సంరక్షించి మరో 24 కింగో కోబ్రా పిల్లలను అనకాపల్లి జిల్లాలోని శంకరం రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు. తెలంగాణ-ఏపీలోని పాపికొండల అభయారణ్యం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్రన్ ఘాట్ ప్రాంతాలు గిరినాగులకు అనువైన అవాసంగా కొనసాగుతున్నాయి.

కొన్ని నెలల క్రితం 30 కింగ్ కోబ్రా పిల్లల(ఓఫియోఫాగస్ హన్నా)ను తూర్పు కనుమల్లోకి విజయవంతంగా విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని గంగవరం గ్రామంలోని నల్లరాయి కొండకు ఆనుకుని ఉన్న అచ్చియ్యమ్మకు చెందిన జీడితోటలో కింగ్ కోబ్రా పెట్టిన గుడ్ల గూడు చుట్టు ప్రత్యేక వల కట్టి సంరంక్షించారు. అటవీ అధికారులు, సొసైటీ సభ్యులు ఒక నెలకు పైగా గుడ్లను పర్యవేక్షించారు. పిల్లలు బయటకు వచ్చాక వాటిని అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని వాలబు గ్రామానికి సమీపంలోని పాడేరు డివిజన్‌లోని అటవీ ప్రాంతాలలోకి విడుదల చేశారు.

అంతరించిపోతున్న ‘గిరినాగు’ (కింగ్ కోబ్రా) జాతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల (Eastern Ghats) పరిధిలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని శంకరం రిజర్వ్ అటవీ ప్రాంతంలోని 2,400 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్యేక అభయారణ్యాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం రాగానే ఇది అందుబాటులోకి వస్తుంది.ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు సంయుక్తంగా అడవులలో ఈ పాముల సంచారాన్ని గుర్తిస్తూ, జనావాసాల్లోకి వచ్చిన వాటిని సురక్షితంగా రక్షిస్తున్నాయి. గిరినాగుల గుడ్లను, పిల్లలను సంరక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Latest News