-కోవిడ్ థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ 12 పరీక్షలు రద్దు చేసిన మోదీ
-ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై సమీక్ష కూడా చేయని తాడేపల్లి శకునిమామ
-లక్షలాది మంది పిల్లల ప్రాణాల రక్షణకు సీఎం, మంత్రులు పూచీ ఇవ్వగలరా?
-విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాల రక్షణ కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాం
-తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
విధాత:కోవిడ్ తీవ్రత నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వల్ల తలెత్తే సమస్యలు, రద్దు చేయాల్సిన ఆవశ్యకతపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నిపుణులు, విద్యావేత్తలు, అధికారులతో సమీక్షించే సమయం దొరికింది.కానీ తాడేపల్లి శకుని మామ జగన్ రెడ్డి గారికి మాత్రం సమయం దొరకడంలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవ చేశారు. ప్రధాని సమీక్ష అనంతరం దేశమంతా సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ పరీక్షలు రద్దు చేసినా, ఏపీ సర్కారు ఇంకా పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకుండా మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ప్రాణాల రక్షణ కోసం పరీక్షల రద్దు డిమాండ్తో వివిధ మార్గాలలో పోరాడుతోన్న నారా లోకేష్ బుధవారం జూమ్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థిసంఘ నేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా పరీక్షలు రద్దు చేస్తే, మన రాష్ట్రంలో పది,ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం రద్దు చెయ్యకుండా వాయిదా వేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విద్యార్థుల పరీక్షలపై సమీక్షకు సమయంలేని సీఎం తన సొంత బ్రాండ్స్ మద్యం అమ్మి 18 వేల కోట్లు ఎలా జనాల నుండి పిండాలో, ఇసుక ప్రైవేట్ కంపెనీ కి కట్టబెట్టి కోట్లు ఎలా దోచెయ్యాలి అని ప్రణాళికలు సిద్ధం చేసే బిజీలో ఉన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కరోనా ఫస్ట్,సెకండ్ వేవ్ కలిపి 17 లక్షల కేసులు,11034 మంది చనిపోయారని, వీరిలో 556 మంది ఉపాధ్యాయులున్నారని, ఒక్క సెకండ్ వేవ్ లోనే 400 మంది ఉపాధ్యాయులు చనిపోయారని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయన్నారు. సెకండ్ వేవ్ లో కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో బెడ్లు దొరక్క,ఆక్సిజన్ లేక,మందులు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మన రాష్ట్రంలో 14 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, 18-45 ఏళ్ల వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పట్లో వేసే అవకాశం లేదని పేర్కొన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని, ఇది పిల్లలపై తీవ్రప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరించిన విషయాలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా పరీక్షల అదే సమయంలో నిర్వహిస్తామనడం మూర్ఖత్వమేనన్నారు. థర్డ్ వేవ్ టైములో పరీక్షలు నిర్వహిస్తే సుమారు 15 లక్షల మంది విద్యార్థులలో చాలామందికి వైరస్ సోకవచ్చని, వేలాది మంది మరణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లల ప్రాణాలకు ..పరీక్షలు నిర్వహించి తీరుతామంటోన్న శకుని మామ జగన్ రెడ్డి గానీ, ఆయన మంత్రులు గానీ హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పరీక్షలు రద్దు చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశానని, ఆఖరికి కేంద్ర హోంమంత్రి గారికి కూడా లేఖ రాసి పరీక్షల వాయిదా వేసే అంశం పై జోక్యం చేసుకోవాలని కోరినా స్పందన లేకపోవడంతో కోర్టుకి వెళ్లడంతో, తప్పనిసరై పరీక్షలు వాయిదా వేశారని పేర్కొన్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారని, ఇదే జరిగితే కోర్టు ద్వారా విద్యార్థుల ప్రాణాల రక్షణకు పరీక్షలు రద్దు చేసేవరకూ పోరాడతానని హామీ ఇచ్చారు. ముందుచూపులేని జగన్ రెడ్డి నిర్ణయాలతో ఇప్పటికే విద్యావ్యవస్థ గందరగోళంలో పడిందని, మతిలేని మూర్ఖపు నిర్ణయాలతో పరీక్షల పేరుతో విద్యార్థుల్ని మానసికంగా వేధిస్తున్నారని, చివరికి విద్యాసంవత్సరం కూడా అస్తవ్యస్తం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల పరీక్షలు కూడా రద్దు చేసిన విషయాలను ఓసారి పరిశీలించి, ఇప్పటికైనా మూర్ఖంగా కాకుండా విజ్ఞతతో ఆలోచించి పరీక్షల రద్దుకి నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ కోరారు.