ఘోర బస్సు ప్రమాదంలో 38 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఘటన 300 అడుగుల లోయలో పడిన బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం?

Reported by: Jagan Mohan Talluri | Breaking | Nov 15, 2023, 4:29 am IST
Read Time: 2 mins
ఘోర బస్సు ప్రమాదంలో 38 మంది మృతి

జమ్ము: జమ్ముకశ్మర్‌లో బుధవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. దోడాలోని అస్సర్‌ కొండ ప్రాంతం వద్ద ఒక బస్సు బోల్తా కొట్టి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 38 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 19 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. వారిని జమ్ముకు హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 


ఒక మలుపు వద్ద డ్రైవర్‌ బస్సుపై అదుపు కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. ఘటన గురించి తెలియగానే వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప దవాఖానలకు తరలించారు. అతివేగమే బస్సు ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. మలుపు వద్ద పూర్తి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ రెండు క్రాష్‌ బారియర్లతోపాటు.. పిట్టగోడను ఢీకొని లోయలో పడిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి నష్టపరిహారం ప్రకటించారు.