వీళ్లు అభిమానులా, టెర్ర‌రిస్ట్‌లా.. థియేట‌ర్ త‌గ‌ల‌బెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్

  • Publish Date - February 8, 2024 / 02:36 AM IST

ఈ రోజుల్లో అభిమానం పేరుతో కొంద‌రు వికృత చేష్ట‌లు చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. స‌ద‌రు హీరో అభిమానులుగా చెప్పుకుంటూ థియేట‌ర్స్‌లో ర‌ణ‌రంగం సృష్టిస్తున్నారు. తెర‌లు చింప‌డం, కుర్చీలు విర‌గ్గొట్ట‌డం, సీట్ల‌కి నిప్పు పెట్ట‌డం, థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో అద్దాలు ప‌గ‌ల‌గొట్ట‌డం, ఇలా ఒక్క‌టంటే ఎన్నో ర‌కాలుగా భీబ‌త్సం సృష్టిస్తున్నారు. ఎవ‌రు ఎంత వార్నింగ్ ఇచ్చిన కూడా కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేదు. తాజాగా కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమా చూడ‌డానికి వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తులు థియేటర్లో మంటలు పెట్టి డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘కెమెరా‌మెన్ గంగతో రాంబాబు’ 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి థియేటర్స్‌లోకి వ‌చ్చింది. ఈ మూవీ అక్టోబర్ 18, 2012 లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాగా, మ‌ళ్లీ 12 ఏళ్ల‌కి రిరిలీజ్ చేశారు.. డాషింగ్ హీరో పూరీ జగన్నాథ్ – పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకులకి క‌నువిందు చేసింది. బద్రి (2000) తర్వాత పవన్ – పూరీ కాంబోలో వచ్చిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నా ఫ్యాన్స్. కాని ఈ మూవీ అప్పట్లో మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ 4కే వెర్షన్ విడుద‌ల చేయ‌గా, ఈ సినిమా చూసేందుకు అభిమానులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర తెగ సంద‌డి చేశారు. క్రాక‌ర్స్ పేలుస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ, పాలాభిషేకాలు చేస్తూ తెగ హంగామా చేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కాని కొంద‌రు అయితే ఏకంగా థియేటర్లో మంటలు పెట్టి డ్యాన్సులు చేస్తూ రచ్చ చేయడంతో థియేట‌ర్ నిర్వాహ‌కులు షోని ఆపేశారు. ఇందుకు సంబంధించిన వీడియాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో పూర్తి క్లారిటీ లేదు. కాగా, ఈ మూవీని నట్టీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ రీ రిలీజ్ చేయ‌గా, ఈ మూవీకి వ‌చ్చిన‌ ప్రతి టిక్కెట్ నుండి రూ.10 జనసేన పార్టీకి ఫండ్‌గా అందిస్తామని నట్టి కుమార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

Latest News