Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు రాజధానికి వెళ్లిన ఆయన, ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయాలు, యువత, దేశ భవిష్యత్, సామాజిక మార్పులు వంటి అనేక అంశాలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్, ముఖ్యంగా జెన్ జీ తరం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రతి 20 ఏళ్లకు కొత్త తరం వస్తుంది

ఇంటర్వ్యూలో జెన్ జీ గురించి ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా స్పందించారు.”ఇప్పుడు అందరూ జెన్ జీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి 20 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుంది. కాలంతో పాటు వారి ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలు మారుతుంటాయి. సమాజం మారుతున్న కొద్దీ యువత అభిప్రాయాలు కూడా కొత్త దిశలో సాగుతాయి” అని ఆయన అన్నారు.

ప్రతి తరానికి ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, దానిని అర్థం చేసుకోవడం నాయకుల బాధ్యత అని పవన్ పేర్కొన్నారు.

నా కుమారుడి స్నేహితుల ఉదాహరణ

యువత మనస్తత్వం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన కుటుంబానికి సంబంధించిన ఒక ఉదాహరణను కూడా ప్రస్తావించారు.నా కుమారుడికి సుమారు 20 మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ముగ్గురు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే ఆన్‌లైన్ వేదికలో చేరారు. వారికి నచ్చని విషయాలపై మాట్లాడటానికి, తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఒక వేదిక దొరికింది” అని చెప్పారు. ప్రస్తుత తరం యువత తమ భావాలను వ్యక్తపరచడానికి డిజిటల్ వేదికలను ఎక్కువగా ఉపయోగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

యువతలోని కోపం అర్థం చేసుకోగలను

జెన్ జీ యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం గురించి కూడా పవన్ స్పందించారు.ఆ వేదికల్లో చేరిన యువత కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. వారి అసహనం వెనుక కారణాలు కూడా ఉన్నాయి. కానీ దానికి సరైన దిశ ఉండాలి. దిశా నిర్దేశం లేని కోపం సమాజానికి ఉపయోగపడదు అని అన్నారు.కేవలం వ్యతిరేకత కోసం వ్యతిరేకించడం కంటే, సమస్యల పరిష్కారానికి దోహదపడే ఆలోచనలు అవసరమని సూచించారు.

తాను తరచుగా యువతతో మాట్లాడుతుంటానని, వారి ఆలోచనలను దగ్గరగా గమనిస్తున్నానని పవన్ తెలిపారు.ఈ తరం యువత ఘర్షణాత్మక రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటోంది. నిరంతరం వివాదాలు సృష్టించే రాజకీయ నాయకులు కాకుండా, సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని వారు ఆశిస్తున్నారు” అని చెప్పారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టే పాలన కావాలని, రాజకీయాల్లో మరింత బాధ్యతాయుతమైన వ్యవహారశైలి రావాలని యువత కోరుకుంటోందని పేర్కొన్నారు.

రాజకీయాలపై యువత దృష్టి మారుతోంది

గత తరాలతో పోలిస్తే ప్రస్తుత యువత రాజకీయాలను చూసే కోణం పూర్తిగా మారిందని పవన్ అభిప్రాయపడ్డారు. వారు కేవలం నినాదాలు లేదా భావోద్వేగాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఫలితాలను కోరుకుంటున్నారని చెప్పారు.ఉద్యోగాలు, విద్య, సాంకేతికత, పారదర్శక పాలన వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.