అరేబియా సముద్రంలో ప్రధాని మోడీ స్కూబా డైవింగ్ చేసి హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు నిర్వహించారు.
అరేబియా సముద్రంలో ప్రధాని మోడీ స్కూబా డైవింగ్ చేసి హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. స్కూబా డైవింగ్ పరికరాల కిట్ను ధరించి బెట్ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోదీ స్కూబా డైవింగ్తో సముద్రజలాల్లోకి వెళ్లి ఒకప్పుడు సముద్ర గర్భంలోని భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించినట్లు హిందువులు బలంగా విశ్వసించే ద్వారక నగర అవశేషాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు. సముద్ర గర్భాన ఉన్న ద్వారకాలో పూజలు చేయడం ఓ దివ్యానుభవమని, పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందానన్నారు. శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారని పోస్టులో పేర్కొన్నారు. దీనికి తన డైవింగ్ చిత్రాలను జతచేశారు.
ప్రధాని కొన్ని నెలల క్రితం లక్షద్వీప్ వద్ద స్కూబా డైవింగ్ చేసిన విషయం తెలిసిందే. అరేబియా సముద్రంలో మునిగిన ప్రాచీన ద్వారక నగారన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం తాజాగా జలాంతర్గామి సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్ గావ్ డాక్యార్డ్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారు. ఇది భక్తులను అరేబియా సముద్రంలో 800 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూడగలుగుతారు.
భారత్లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారక ఒకటిగా హిందు పురణాల కథనం.. పశ్చిమ సముద్రతీరంలో సౌరాష్ట్ర (నేటి గుజరాత్)లో ద్వారకా పట్టణం ఉంది. దాన్ని ‘ద్వారావతి’ అనే పేరుతోనూ వ్యవహరించేవారు. అనేక ద్వారాలు ఉండటం వల్ల ఈ పేర్లు వచ్చాయని ప్రతీతి. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే నాలుగు ఉద్యానవనాలుండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి మహాభారతం సభా, శాంతి పర్వాల్లో ద్వారకను గురించి అనేక విషయాల ప్రస్తావన ఉంది. జరాసంధుడు అనే రాక్షసుడి దాడుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలన్న శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సుందర నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సేవలను ప్రారంభించింది.