అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర

అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంతకు సిరిసిల్ల బంగారు చీర తరలి వెళ్ళనుంది

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర

– నేతన్న హరిప్రసాద్ భక్త సేవ

– చీరను పరిశీలించిన బండి సంజయ్

– చీరలో రామాయణ ఇతివృత్త చిత్రాలు 

– 26న ప్రధానికి అందించనున్నట్లు హరిప్రసాద్ వెల్లడి

విధాత బ్యూరో, కరీంనగర్: అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంతకు సిరిసిల్ల బంగారు చీర తరలి వెళ్ళనుంది. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు.

హరి ప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను ఆ చీరలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీర చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతన ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారుచేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.