Vinayaka Chavithi | వినాయ‌క చ‌వితి రోజున ఈ రెండు మంత్రాలు ప‌ఠిస్తే.. ఏడాదంతా ఆటంకాలు ఉండ‌వ‌ట‌..!

Vinayaka Chavithi | వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi )సంబురాల‌కు భ‌క్తులంద‌రూ సిద్ధ‌మ‌య్యారు. గ‌ల్లీకో గ‌ణేశుడి( Ganesh Chaturthi )ని ప్ర‌తిష్టించి పూజ‌లు చేసేందుకు భ‌క్తులు( Devotees ) ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వినాయ‌క చ‌వితి రోజున ఈ రెండు మంత్రాలు ప‌ఠిస్తే ఈ ఏడాదంతా ఆటంకాలు ఉండ‌వ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Vinayaka Chavithi | ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi ) వ‌చ్చింది. ఆ రోజున ఉద‌యం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:34 గంటల మధ్యలో పూజ ప్రారంభించేందుకు, విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయమని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ శుభ సమయంలో వినాయకుని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మ‌రి పూజా విధానం.. ఆ రోజున ప‌ఠించాల్సిన రెండు మంత్రాల గురించి తెలుసుకుందాం..

వినాయక చవితి రోజున తెల్ల‌వారుజామునే మేల్కొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంత‌రం త‌ల స్నానం చేసి కొత్త బ‌ట్ట‌లు ధరించాలి. ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌ట్టి, పూల‌మాల‌తో అలంక‌రించుకోవాలి. ఇక ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తామరాకును ఉంచుకోవాలి. ఈ తామ‌ర ఆకుపై వినాయ‌కుడి ప్ర‌తిమ‌ను ప్ర‌తిష్టించాలి. వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో గంగాజలం, నీళ్లు పోసి, పైన కొబ్బ‌రికాయ‌, జాకెట్ ముక్క ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. దీపారాధన చేసి, అగరుబత్తీలు వెలిగించాలి. అనంతరం ఆచమనం, ప్రాణాయామం చేసి పూజను మొదలు పెట్టుకోవాలి. ఒక తమలపాకులో పసుపు గణపతిని చేసుకొని గణేశ షోడశ నామాలతో పూజించి బెల్లం, అరటి పండు నివేదించి హారతి ఇవ్వాలి. తర్వాత పూవులు, అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో విఘ్నేశ్వ‌రుడిని అర్చించాలి. తరువాత 21 రకాల పత్రితో శాస్త్రోక్తంగా పత్రి పూజను నిర్వహించాలి.

ప‌ఠించాల్సిన రెండు మంత్రాలు ఇవే..

వినాయ‌క చ‌వితి రోజున ఈ రెండు మంత్రాలు ప్రతిఒక్కరూ చదవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

మొద‌టి మంత్రం..
గం క్షిప్ర ప్రసాదనాయ నమః

రెండో మంత్రం..

వక్రతుండాయ హుం నమః

ఈ రెండు మంత్రాలను ఒక్కొక్క మంత్రం 21సార్లు చొప్పను చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆటంకాలు, విఘ్నాలు ఉండవని.. మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చని చెబుతున్నారు.

చివ‌ర‌గా.. విఘ్నేశ్వ‌రుడికి ధూపం వేసి, దీపం దర్శింపజేయాలి. ఇప్పుడు 21 రకాల పిండి వంటలు, భక్ష్య భోజ్య చోష్య, లేహ్య పానీయాలతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించాలి. పిండివంటలలో ముఖ్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, గారెలు, బూరెలు ఉంటే మంచిది. చివరగా దక్షిణ తాంబూలాదులు సమర్పించి మంగళ హారతులు ఇవ్వాలి.