Ugadi 2024 | తెలుగు రాష్ట్రాలు ఉగాధి పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 9న చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున ఉగాది పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. ఈ తెలుగు సంవత్సరాన్ని శ్రీ ‘క్రోధి నామ సంవత్సరం’గా పండితులు చెబుతున్నారు. క్రోధి నామ సంవత్సరంతో కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరంకావడం విశేషం. శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటే.. క్రోధమును కలిగించేదని పంచాంగకర్తలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కుటుంబసభ్యుల మధ్య క్రోధం, దేశంలో పలు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటి కలిగే సూచనలున్నాయని పండితులు పేర్కొంటున్నారు.
ఉగాది అంటే ఏంటి?
కాలగమనం ప్రారంభమైంది ఈ రోజునే కావడం విశేషం. సకల చరాచర సృష్టికి బ్రహ్మదేవుడు బీజం వేసింది ఇదేరోజునని.. నిజానికి ఈ ‘యుగాదే’ కాల ప్రవాహంలో ‘ఉగాది’గా మారిందని చెబుతున్నారు. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదంటే.. జన్మ, ఆయుష్షు అనే అర్థాలున్నాయి. వీటికి ఆది ఉగాది అని.. అనగా ప్రపంచంలోని జనులకు తొలిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. మరోవిధంగా చెప్పాలంటే ‘యుగం’ అనగా రెండు.. లేక జంట అనే అర్థం ఉన్నది. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా.. ఆ యుగానికి ఆది ఉగాదిగా మారిందని పండితులు పేర్కొంటున్నారు. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యుడికి సకల రుతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలాలకు ఉషా దేవతయే మాతృ స్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. వేదాలను తస్కరించిన సోమకాసురుడి బారి నుంచి వాటిని కాపాడి, బ్రహ్మదేవుడికి అప్పగించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడని పౌరాణిక గాథ. శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాఢ్యమి నాడే మత్స్యావతారం ఎత్తాడని చెబుతారు. కనుకే శ్రీ మహావిష్ణువు అవతార గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడని.. సృష్టి ఆరంభించిన దానికి సంకేతంగా ఉగాది జరుపుకుంటారని పండితులు వివరించారు.