విధాత, హైదరాబాద్‌:  గోషా మహల్ చాక్నవాడిలో ఐదు అంతస్థుల భవనం కుంగిపోయింది. పక్కనే నూతన భవనం నిర్మాణం కోసం జరిగిన లోతైన తవ్వకాల ప్రభావంతో, పక్కనే ఆనుకొని ఉన్న ఐదు అంతస్థుల భవనంలో భారీ పగులు ఏర్పడ్డాయి. భవనం కుంగిపోయినట్టు కనిపించడంతో చుట్టుపక్కల ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా, స్పందన లేకపోయిందని అక్కడివారు ఆరోపిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో గోషామహల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, భవనంలో ఉన్న వారిని తక్షణమే ఖాళీ చేయించారు. పగుళ్లు ఏర్పడ్డ బిల్డింగ్ లో ఉన్న వాళ్లు భయంతో బయటకు వచ్చి నిలబడ్డారు. కాగా, గతంలో కూడా ఇదే ప్రాంతంలో నాలా పలుసార్లు కుంగిన సంఘటనలు నమోదవడం ఆందోళనకు కారణమవుతోంది. ప్రమాదాన్ని పూర్తిగా అంచనా వేసేందుకు అధికారులు ప్రాంతాన్ని మోహరించి, నూతన నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.