Syrian News Anchor | యాంకర్ వార్తలు చదువుతుండగానే పేలిన భవనం..వైరల్ గా వీడియో

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jul 17, 2025, 1:41 pm IST
Read Time: 3 mins
Syrian News Anchor | యాంకర్ వార్తలు చదువుతుండగానే పేలిన భవనం..వైరల్ గా వీడియో

Syrian News Anchor | విధాత: ఓ న్యూస్ ఛానల్ కార్యాలయంలో మహిళా యాంకర్ లైవ్ లో వార్తలు చదువుతుండగానే..వెనుక ఉన్న భవనం పేలిపోయిన ఘటన వీడియో వైరల్ గా మారింది. సిరియా రాజధాని డమాస్కస్ లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను ఇజ్రాయెల్ పేల్చేసింది. ఆ సమయంలో ఓ టీవీ న్యూస్ చానల్ కార్యాలయంలో ఓ మహిళా యాంకర్ వార్తలు చదువుతుంది. తన వెనుక ఉన్న భవనంలో ఒక్క సారిగా భారీ పేలుడు జరుగడం..ఆ ప్రకంపనలు తను ఉన్న చోటకు కూడా రావడంతో యాంకర్ భయంతో వార్తలు చదవడం మధ్యలోనే ఆపేసి పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్‌ రెబల్‌ గ్రూపునకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ డమస్కస్ పై బాంబులు, క్షిపణులతో విరుచుక పడింది. సిరియా రక్షణశాఖ కార్యాలయం ప్రధాన గేటు వద్ద, అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. సిరియా సైనిక దళాల కాన్వాయ్‌పైనా బాంబులేసింది. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా 34 మంది గాయపడ్డారు. డ్రూజ్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌ రంగంలోకి దిగడంతో రెండు వర్గాలు సాయంత్రానికి దిగివచ్చాయి. మళ్లీ కాల్పుల విరమణను ప్రకటించాయి. అయితే ఇప్పటిదాక జరిగిన ఘర్షణల్లో 250మంది మరణించారని..వారిలో 138మంది సైనికులు ఉన్నారని సైనిక వర్గాల కథనం.