ఇజ్రాయెల్‌, పాల‌స్తీనాల మ‌ధ్య యుద్ధ మేఘాలు

  • Publish Date - October 7, 2023 / 10:00 AM IST

  • 20 నిమిషాల్లో ఇజ్రాయెల్ పైకి 5 వేల క్షిప‌ణులు
  • సైనికుల అప‌హ‌ర‌ణ‌, చిత్ర‌హింస‌లకు గురిచేసి హ‌త్య‌లు
  • యుద్ధం ప్ర‌క‌టించిన టెల్ అవీవ్‌


విధాత‌: ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌పంచం ముందు మ‌రో కొత్త స‌వాలు నిలిచింది. ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే ఇజ్రాయెల్‌, పాల‌స్తీనాల మ‌ధ్య యుద్ధ మేఘాలు (Israel, Palastina) క‌మ్ముకున్నాయి. శ‌నివారం ఉద‌యం నుంచే గాజా స్ట్రిప్‌లోని వేర్పాటువాద హ‌మాస్ ద‌ళాలు ఇజ్రాయెల్‌పై క్షిప‌ణుల వ‌ర్షాన్ని కురిపించాయి. వీరితో ఇత‌ర ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ‌లూ జ‌త‌క‌ట్టాయి. వీరంతా క‌లిసి ఇజ్రాయెల్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మార‌ణ‌హోమాన్ని సృష్టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


ఈ ప‌రిణామాల‌తో ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం య‌ద్ధాన్ని ప్ర‌క‌టించింది. హ‌మాస్ ద‌ళాలు యుద్ధాన్ని ప్రారంభించాయని, తాము దీనిని ముగిస్తామ‌ని ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి యోవ్ గాలెన్‌ ప్ర‌క‌టించారు. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని పౌరులెవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని, త‌గిన సూచ‌న‌లు పాటించాల‌ని సూచించారు. అక్క‌డి వార్తా క‌థ‌నాల ప్ర‌కారం.. క్షిప‌ణి దాడికి బ‌లై ఇజ్రాయెల్ పౌరులు మ‌ర‌ణిస్తున్నారు. షార్ హెనెజివ్ కౌంటీ మేయ‌ర్ ఒక‌రు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.


హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఎస్‌యూవీలు, బైక్‌ల‌పై ఇజ్రాయెల్ న‌గ‌రాల్లోకి ప్ర‌వేశించి పౌరుల‌పై విచ్చ‌ల‌విడిగా కాల్పుల‌కు దిగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో చక్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఇజ్రాయెల్ సైనికుల‌ను అప‌హ‌రించి వారిని తీవ్ర హింస‌కు గురి చేసి చంపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గాజా ప్రాంతంలో వీరి మృత‌దేహాల‌ను ఈడ్చుకెళుతున్నార‌ని ప‌లు వార్తా సంస్థ‌లు పేర్కొన్నాయి.


ఈ దాడుల‌పై హ‌మాస్ మిలిటెంట్ల నాయ‌కుడు మొమ‌మ్మ‌ద్ డాయిఫ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ‘ఇజ్రాయెల్ అతిక్ర‌మ‌ణ‌కు మేము ఫుల్‌స్టాప్ పెడ‌దామ‌నుకుంటున్నాం. దీనికి దేవుడి సాయం ఉంది. ఆప‌రేష‌న్ అల్ అక్సా ఫ్ల‌డ్ పేరుతో యుద్ధాన్ని మొద‌లుపెట్టాం. మొదటి 20 నిమిషాల్లోనే 5 వేల క్షిప‌ణుల‌ను శ‌త్ర‌వుల‌పై ప్ర‌యోగించాం’ అని ప్ర‌క‌టించాడు.

Latest News