విధాత: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) ఒక ఆశ్చర్యకర ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మాస్కోకు ఆహ్వానిస్తామని, టీ, పాన్కేకులతో ఆయను ఆతిథ్యం ఇస్తానని ప్రకటించారు. అమెరికా ఇచ్చిన ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంఎస్) ను ఉపయోగించి ఉక్రెయిన్ బుధవారం భీకర దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆయన.. ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అనంతరం ఉక్రెయిన్ యుద్ధంపై విలేకర్లతో మాట్లాడారు.
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా ఇప్పటికే ఓడిపోయిందని అమెరికా (America) అధ్యక్షుడు బైడెన్ ప్రకటించినట్లు ఓ జర్నలిస్ట్ ప్రస్తావించగా.. యుద్దంలో రష్యా ఓడిపోతే.. ఉక్రెయిన్కు ఏటీఏసీఎంఎస్ ఎందుకు సరఫరా చేశారని పుతిన్ ప్రశ్నించారు. అనంతరం తన స్పందనను పొడిగిస్తూ.. ఉక్రెయిన్ దగ్గర నుంచి వారి క్షిపణులను ఇతర ఆయుధాలను వెనక్కి తీసేసుకోమనండి. ఆ తర్వాత బైడెన్ను మాస్కోకు ఆహ్వానించి.. టీ, పాన్కేక్తో అతిథ్యం ఇస్తాం అని వ్యాఖ్యానించారు.
చంపేస్తానని బెదిరింపా?
పుతిన్ టీ ఆహ్వానం చూడటానికి సాధారణంగానే కనిపించినా.. అందులో తీవ్రమైన హెచ్చరిక ఉందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే.. పుతిన్తో విభేదించిన వారు, ఆయనను ధిక్కరించి విదేశాలలో తలదాచుకుంటున్న చాలా మంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరిలో చాలా మంది చావుకు కారణం.. విషపూరితమైన టీ ను తాగడమే. 2006లో హత్యకు గురైన పుతిన్ విమర్శకుడు అలెగ్జాండర్ లిత్వినెన్కో హత్య కేసులో రెండేళ్ల క్రితం యురోపియన్ కోర్టు ఒకటి ఇచ్చిన తీర్పు ఈ వాదనలకు బలం చేకూర్చింది.
అలెగ్జాండర్ మరణానికి రష్యా ప్రభుత్వం చేసిన విషప్రయోగమే కారణమని తేల్చి చెప్పింది. అయితే ఆ ఆరోపణలను క్రెమ్లిన్ తోసి పుచ్చింది. ఈ కోవలోనే రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నోవల్నీపైనా సెర్బియాలో హత్యాయత్నం జరిగింది. అతడు టీ తాగే మగ్లో విషపూరిత ద్రావణాన్ని కలపడం ద్వారా చంపేయాలని ప్రణాళిక వేశారు. అతడు దాన్ని తాగినప్పటికీ.. ఇతర దేశాల్లో వైద్యం తీసుకుని మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. దీంతో పుతిన్.. బైడెన్కు ఇచ్చిన టీ ఆఫర్ ఒక హెచ్చరికేనని తెలుస్తోంది.