విధాత: ఒకడేమో మాయమాటలు చెప్పాడు.. మరోకడేమో ప్రేమపేరుతో వంచించాడు.. ఆ ఇద్దరు కలిసి ఆ బాలికపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. చివరకు ఆమె గర్భం దాల్చింది.. శనివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మరి ఆ శిశువు తండ్రిని తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన ఎక్కడో జరగలేదు.. మన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటగిరిలో 16 ఏండ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది. తల్లీబిడ్డ కలిసి ఇండ్లలో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వెంకటగిరిలో నివాసముంటున్న సాయికుమార్(25) బాలికతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు.
అదేవిధంగా బాలిక పనిచేస్తున్న ఇంటి పక్కన వాచ్మన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన బుద్దిమాన్ కామే(53) బాలికకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లేవాడు. మత్తుమందు కలిపిన ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. వాటిని తిన్న తర్వాత మత్తులోకి వెళ్లిన బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరు వేర్వేరుగా అనేక సార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
అయితే బాలిక గర్భం దాల్చినట్లు ఆశా వర్కర్లు గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. బాలిక ఆరు నెలల గర్భిణిని అధికారులు తేల్చారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా సాయికుమార్, కామేపై జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, గత నెలలో రిమాండ్కు తరలించారు.
అప్పట్నుంచి బాధితురాలు స్టేట్ హోమ్లో ఉంటుంది. శనివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక గర్భం దాల్చేందుకు కారణం ఎవరనే విషయాన్ని తేల్చేందుకు నిందితులిద్దరితో పాటు పుట్టిన బాబుకు సంబంధించిన డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.