- లుథియానాలో రూ. 8 కోట్ల క్యాష్ వ్యాన్ దోపిడీ
- చోరీ సక్సెస్తో ఉత్తరాఖండ్లో మొక్కు చెల్లింపు
- భక్తులకు ఫ్రీగా ఫ్రూటీలు పంచిన సివిల్ పోలీసులు
- మాస్కు తీసి రూ.10 ఫ్రూటీలు తాగుతుండగా
- కిలేడీ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు
విధాత: క్యాష్ వ్యాన్ నుంచి రూ.8 కోట్లు దోచేసిన కిలేడీ దంపతులు పోలీసులు పన్నిన ఫ్రీ ఫ్రూటీ వలకు చిక్కారు. ఉచితంగా ఇచ్చిన రూ.10 ఫ్రూటీలు తాగేందుకు మాస్కు తీయగానే ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ (Punjab) లోని లుథియానాలో ఈ నెల 10న రూ. 8 కోట్ల క్యాష్ వ్యాన్ దోపిడీ మాస్టర్ ప్లాన్వేసిన కిలేడీ చదివింది ఇంటర్ అయినా.. మోసం చేయడంతో ఆరితేరింది. పోలీసుల వివరాల ప్రకారం..
అసలు ఏమి జరిగిందంటే
లుథియానాలోని న్యూరాజ్ గురునగర్ ప్రాంతంలో ఉన్న సీఎంఎస్ సెక్యూరిటీస్ కి చెందిన ఒక క్యాష్ వ్యాన్ ను ఈ నెల 10వ తేదీ రాత్రి ఆయుధాలు ధరించిన దుండగులు చోరీ చేశారు. ఆ సమయంలో ఈ వ్యాన్లో రూ.8 కోట్ల 49 లక్షలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ముల్లాపూర్ లో రోడ్డు పక్కన పోలీసులకు క్యాష్ వ్యాన్ కనిపించింది. అందులో మారణాయుధాలు కూడా కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం
ఈ చోరీ నిందితులను పట్టుకునేందుకు లుథియానా పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం తీసుకున్నారు. వ్యాన్ జీపీఎస్ ను ట్రాక్ చేశారు. నిందితుల మొబైల్ టవర్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. వీటి సహాయంతో ఐదుగురు నిందితులను వెంటనే పట్టుకున్నారు. వారి నుంచి రూ.5,96,00,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ వెనక మాస్టర్ మైండ్ డాకు హసీనా, అలియాస్ మన్ దీప్ కౌర్ ఉరఫ్ మోనా ఉన్నట్టు కనుగొన్నారు. ఆమె తన భర్త.. మరో ఐదుగురితో కలిసి పరార్ అయ్యింది.
పోలీసులు మన్ దీప్ కౌర్ కదలికలను ట్రాక్ చేశారు. మన్ దీప్ కౌర్ తన భర్తతో కలిసి నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోవచ్చని పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే వారి మీద లుక్ అవుట్ నోటీసులు జారీ అవ్వడంతో.. విదేశాలకు పారిపోవాలన్న వారి ప్రయత్నం విఫలమైంది.
మొక్కు చెల్లించేందుకు వెళ్లి.. దోపిడీ సక్సెస్ కావడంతో ఉత్తరాఖండ్ లోని చమేలీలో ఉన్న హేమకుండ్ సాహెబ్ కు మొక్కు తీర్చుకునేందుకు డాకూ హసీనా బృందం వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ తీవ్ర చలికి భక్తులు అందరూ నిండుగా దుస్తులు, మాస్కులు ధరిస్తారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా, కిలేడీ దంపతులకు విషయం తెలిసి పారిపోకుండా వలపన్ని పట్టుకొనేందుకు పోలీసులు ఒక ఉపాయం ఆలోచించారు. భక్తులకు ఫ్రీగా రూ.10 ఫ్రూటీలు హేమకుండ్ సాహెబ్ ప్రాంతంలో పంపిణీ చేయడం ప్రారంభించారు.
ఫ్రూటీలు తాగేందుకు మాస్కులు తీయగానే..
పోలీసులు తమను వెతుక్కుంటూ ఉత్తరాఖండ్ వరకు వచ్చారనే విషయం తెలియని కిలేడీ దంపతులు సివిల్ డ్రెస్లో పోలీసులు పంచిన ఫ్రీగా రూ.10 ఫ్రూటీలు తీసుకున్నారు. పక్కకు వెళ్లి మాస్కు తీసి ఫ్రూటీలు తాగబోతుండగా గుర్తించిన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మన్ దీప్ కౌర్తోపాటు ఆమె భర్త గౌరవ్ ఉరఫ్ గుల్షన్ ను కూడా అరెస్టు చేశారు.
వారిని నుంచి 21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో 9 మందిని అరెస్టు చేశారు. ఈ జంట కేదార్నాథ్, హరిద్వార్లను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, మొదటి మొక్కు దర్శనం తిరుగు ప్రయాణంలోనే పోలీసులకు పట్టుబడ్డారు.
మోనా చదివింది ఇంటర్ మాత్రమే
మన్దీప్ కౌర్ అలియాస్ మోనా కేవలం 12వ తరగతి పాస్ అయింది. కానీ, ఆమెకు పెద్ద పెద్ద ఆశలు ఉండేవి. నాలుగు నెలల క్రితం లూథియానాకు వచ్చి మోనా.. తన ప్లాన్లో భాగంగా నగదు నిర్వహణ సంస్థ CMS సెక్యూరిటీస్లో పని చేయడానికి ముందు అనేక ఉద్యోగాలు చేసింది. ఇన్సూరెన్స్ ఏజెంట్గా, లాయర్కి అసిస్టెంట్గా మోనా పనిచేసింది.
కాగా.. అనేక సందర్భాల్లో ఆమె తనను తాను ‘వకీల్’గా పరిచయం చేసుకుంది. నల్ల ప్యాంటు, తెల్లటి అంగి ధరించి కోర్టు సందర్శకులను ఆకర్షించడానికి ప్రయత్నించేది. కోర్టు కాంప్లెక్స్లో, ఏటీఎంలలో రీఫిల్ చేయడానికి సైట్ను సందర్శించే మంజిందర్తో ఆమెకు స్నేహం ఏర్పడింది. మన్దీప్, మంజిందర్, మోనా భర్త, సోదరుడితో సహా 10 మంది సహచరులు జూన్ 10న పంజాబ్లోని లుథియానాలో రూ. 8 కోట్ల క్యాష్ వ్యాన్ దోపిడీ పాల్పడ్డారు. చివరికి అందరూ చిక్కి కటకటాల పాలయ్యారు.