విభజన హామీలు విస్మరించిన కేంద్రం రాముడు అందరివాడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి విధాత, కరీంనగర్ బ్యూరో: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన, కార్మికుల పక్షాన తమ పోరాటాలు ఆగబోవని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పేద ప్రజలు తమ పార్టీని గుండెల్లో పెట్టుకుంటారని, వారికి ఎర్రజెండా ఎల్లప్పుడూ […]
విధాత, కరీంనగర్ బ్యూరో: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన, కార్మికుల పక్షాన తమ పోరాటాలు ఆగబోవని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పేద ప్రజలు తమ పార్టీని గుండెల్లో పెట్టుకుంటారని, వారికి ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సిపిఐ ప్రజా చైతన్య యాత్రను ఆదివారం ఆయన కరీంనగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు తాము అమ్ముడు పోయామంటూ పదేపదే చేస్తున్న ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెట్రేగి పోయిందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాముడిని బిజెపికో, మరో వర్గానికి పరిమితం చేయాలని చూడడం సిగ్గుచేటని… ఆయన అందరివాడని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి చేస్తున్న మోసాలను ప్రజల దృష్టికి తేవడానికి ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బిఎస్ఎన్ఎల్, రైల్వే, సింగరేణి, ఎల్ఐసి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను ప్రజలు అడ్డుకోవాలని అన్నారు.
అంతకుముందు ఇరువురు నేతలు కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి, మార్కెట్ కూడలిలోని అన్న బేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, గుంటి వేణు, తాండ్ర సదానందం, వెన్న సురేష్ పార్టీ నేతలు పొన్నగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందె.స్వామి కె సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, గూడెం లక్ష్మి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.